రూ.51 లక్షల పాత నోట్లు స్వాధీనం... అయిదుగురి అరెస్టు
కోల్ కతా లోని బగుయోటిలో శుక్రవారం అయిదుగురు వ్యక్తుల నుంచి రూ.51 లక్షల విలువైన పాత కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కోల్ కతా: నోట్ల రద్దు జరిగిన నాలుగు నెలల తరువాత కూడా ఇంకా పాత నోట్ల మార్పిడి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయనడానికి ఉదాహరణ ఈ ఘటన. తాజాగా రద్దయిన పెద్ద నోట్లు కలిగి ఉన్న అయిదుగురిని బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.
కోల్ కతా లోని బగుయోటిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వారి వద్ద నుంచి రూ.51 లక్షల విలువైన పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఓ ఏజెంట్ దగ్గర మార్పిడి చేసుకునేందుకు వచ్చిన వీరిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రలోని థానే పోలీసులు కూడా తనిఖీలు నిర్వహిస్తూ గత వారం రోజుల్లో రూ.2.25 కోట్ల పాత నోట్లను స్వాధీనం చేసుకుని, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 25న రూ.46 లక్షల రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు మళ్లీ రెండ్రోజుల వ్యవధిలోనే మరో రూ.50 లక్షల పాత నోట్లను పట్టుకున్నట్లు పోలీసు జాయింట్ కమిషనర్ అశుతోష్ దుమ్రే తెలిపారు.
అలాగే భోపాల్ లోని కూడా బుధవారం రూ.9.70 లక్షల రద్దయిన రూ.500, 100 నోట్లను పట్టుకున్నారు. ఈ ఘటనలో ప్రమోద్ నాయర్, సయ్యద్ వఖార్ అలీ అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు పిప్లానీ పోలీసుస్టేషన్ ఇన్ ఛార్జి హహేంద్ర సింగ్ చౌహాన్ చెప్పారు.