షాకింగ్: గవర్నర్ బండారు దత్తాత్రేయను నెట్టేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సస్పెన్షన్ వేటు
సిమ్లా: హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ప్రతిపక్ష నేత సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు స్పీకర్.
సభలో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ సభ్యులు
వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉదయం గవర్నర్ దత్తాత్రేయ అసెంబ్లీకి హాజరయ్యారు. సమావేశం మొదటి నుంచే కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభకు ఆటంకం కలిగించారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడాలంటూ డిమాండ్ చేశారు. తమ తమ సీట్ల నుంచి లేచి పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
గవర్నర్ దత్తాత్రేయను నెట్టేసిన కాంగ్రెస్ సభ్యులు
ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకడంతో దత్తాత్రేయ తన ప్రసంగం చివరి వ్యాఖ్యలను చదివి తన ప్రసంగం పూర్తనైనట్లు భావించాలంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించి నెట్టేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీనిపై అధికార బీజేపీ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు.
కాంగ్రెస్ సభ్యులు తీరుపై బీజేపీ ఆగ్రహం
గవర్నర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్మెండ్ చేయాలని బీజేపీ తీర్మానం ప్రవేశపెట్టింది. గవర్నర్ను నెట్టేసిన ఘటనపై హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. గవర్నర్ పట్ల అనుచితంగా వ్యవహరించిన సభ్యులను సస్పెండ్ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. స్పీకర్ ఆమోదం తెలిపారు.
కాంగ్రెస్ పక్ష నేత సహా నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్
దీంతో కాంగ్రెస్ పక్ష నేత సహా నలుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే(మార్చి 20) వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, సస్పెండైన వారిలో ప్రతిపక్ష నేత ముకేష్ అగ్నిహోత్రి, ఎమ్మెల్యేలు హర్ష్ వర్ధన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రైజదా, వినయ్ కుమార్ ఉన్నారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. సమస్యలపై ప్రశ్నిస్తే తమ ఎమ్మెల్యేలపై వేటు వేశారని ఆరోపించారు. గవర్నర్ తన ప్రసంగంలో అబద్ధాలను వల్లేవేశారని అన్నారు.