ముఖ్యమంత్రి సంతకం ఫోర్జరీ - రిలీఫ్ ఫండ్ నుంచి లక్షలు స్వాహా - బ్యాంకు అనూహ్య నిర్ణయం
అల్లాటప్పా నేరం కాదిది.. ఏకంగా ముఖ్యమంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి.. నకిలీ చెక్కుల ద్వారా లక్షల రూపాయాలు కాజేశారు.. సెక్రటేరియట్ లో సంచలనం రేపిన ఈ ఉదంతంపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది.. సీఎం ఆదేశించినట్లుగానే 15 రోజుల్లోపే కంత్రీగాళ్లను పట్టుకున్నారు.. అయితే అప్పటికే వాళ్లు డబ్బులు ఖర్చుచేయడంతో.. రికవరీ డబ్బులపై ప్రభుత్వ రంగ బ్యాంకు అనూహ్య నిర్ణయం తీసుకుంది.. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో మోదీ నిప్పురాజేశాం - అంకిదాస్ సంచలన కామెంట్స్ - ఫేస్ బుక్- బీజేపీ ఉదంతంలో ట్విస్ట్
అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధిలో గోల్ మాల్ చోటుచేసుకున్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. సీఎం సర్బానంద సోనోవాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ చెక్కులతో డబ్బులు విత్ డ్రా చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సోనోవాల్.. ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ ను పురమాయించారు. 15 రోజుల్లోగా నిందితులను ట్రేస్ చేయాలని ఆదేశించారు. దర్యాప్తు బాధ్యతను 'లేడీ సింగం' రోసి కలితకు అప్పగించారు.
సీఎం సంతకం ఫోర్జరీకి సంబంధించి ఆగస్టు 12న కేసు నమోదు చేసుకున్న విజిలెన్స్ విభాగం.. సెక్రటేరియట్ లోని ఎస్బీఐ బ్రాంచ్ నుంచి పని మొదలుపెట్టింది. నకిలీ చెక్కుల ద్వారా ఫరీదాబాద్(యూపీ)లోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు, బస్తీ(యూపీ)లోని ఇండియన్ బ్యాంక్ శాఖకు డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తించారు. రెండు ఊళ్లకు ప్రత్యేక బృందాలు వెళ్లి సోదాలు జరపగా, నిందితులు డబ్బులు తీసుకునే సమయంలో కేవైసీ(నో యువర్ కస్టమర్) కింద ఫోన్ నంబర్లు రాసినట్లు గుర్తించారు.
కేవైసీలో దొరికిన ఫోన్ నంబర్లను ట్రేస్ చేసిన పోలీసులు.. ఫరీదాబాద్, బస్తీకి చెందిన మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుననారు. మొహ్మద్ ఆరిఫ్, మొహ్మద్ ఆసిఫ్, లాల్ జీ, సర్వేశ్ రావు, రవీంద్ర కుమార్ అనే ఐదుగురు అనుమానితుల్ని విచారించగా, నేరం ఒప్పుకున్నారని, ఈ ముఠా.. అస్సాంలోనే కాకుండా గతంలో ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడిందని పోలీసులు చెప్పారు. సోమవారం గువహటి కోర్టు ఆ ఐదుగురికీ రిమాండ్ విధించింది. కాగా, ఫోర్జరీ సంతకాలను పరిశీలించకుండా చెక్కులు స్వీకరించడం, డబ్బులు ఇచ్చేయడం తమ తప్పేనని స్టేట్ బ్యాంక్ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేకాదు, నిందితులు స్వాహా చేసిన రూ.4 లక్షల మొత్తాన్ని వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ వ్యవహారంలో బ్యాంకు లేదా సెక్రటేరియట్ సిబ్బంది పాత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నది.