ఎన్నికల షెడ్యూల్ వేళ మంత్రాంగం.. అప్పటికప్పుడు ఐదుగురికి డీజీపీ హోదా
చెన్నై : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వేళ తమిళనాడు ప్రభుత్వం చక్రం తిప్పింది. మరికొద్ది గంటల్లో షెడ్యూల్ విడుదల కానుందన్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటికప్పుడు ఐదుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీగా పదోన్నతి కల్పించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చానీయాంశమైంది. హడావుడిగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యమేంటో అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పోటీకి 75 ఏళ్లు కటాఫా?.. యువతకు ఛాన్సుందా?.. బీజేపీ మర్మమేంటో?
డీజీపీ లాంటి ఉన్నతమైన పదవుల్లో నియామకాలకు సంబంధించి.. కనీసం రెండేళ్ల సర్వీస్ ఇంకా మిగిలి ఉండాలనేది సుప్రీంకోర్టు చెబుతున్న అంశం. అయితే తమిళనాడు ప్రభుత్వం ఆ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ఇక్కడ డీజీపీలుగా పనిచేస్తున్నవారికి సర్వీస్ రెండు సంవత్సరాల లోపే ఉందని, ఈ నిబంధనలు మార్చాలని కోరింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. అదేమీ పట్టించుకోకుండా ఆదివారం నాడు హడావుడిగా 1987 బ్యాచ్ కి చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పించింది.
తమిళనాడులో డీజీపీ ర్యాంక్ అధికారుల సంఖ్య మొత్తం 14కి చేరింది. మామూలుగా ఐతే డీజీపీ హోదా అధికారుల సంఖ్య ఆరు. సాయంత్రం 5 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజవుతుందన్న నేపథ్యంలో.. మధ్యాహ్నమే కరణ్ సింగ్, విజయ్ కుమార్, శైలేంద్రబాబు, ప్రదీప్ వి. ఫిలిప్, ఆర్సీ కుడావ్లాను డీజీపీలుగా ప్రమోట్ చేసింది ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే కోడ్ అమలవుతుందన్న కారణంగా అప్పటికప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.