ఛత్తీస్గడ్లో దారుణం: ఐదుగరు ఐటీబీపీ జవాన్లను కాల్చి చంపిన కానిస్టేబుల్
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేతకు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ శాఖకు చెందిన జవాన్లను ప్రభుత్వం ఉంచింది. అయితే ఈ జవాన్లపై పారామిలటరీ ఫోర్స్ క్యాంప్కు చెందిన మరో కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని మృతి చెందినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటలకు జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు కూడా గాయపడ్డారు.
నారాయణపూర్లోని ఐటీబీపీ 45వ బెటాలియన్కు చెందిన కేదార్నాథ్ క్యాంప్ వద్ద ఘటన చోటుచేసుకుందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్ రాజ్ చెప్పారు. అయితే ఈ కాల్పులకు దారి తీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఒక కానిస్టేబుల్ ఏడుగురిపై కాల్పులు జరిపిన అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు ఢిల్లీలోని ఉన్నతాధికారులు నిర్థారించారు. ఇదిలా ఉంటే కాల్పులు జరిపిన కానిస్టేబుల్ను ముసుదుల్ రెహ్మాన్గా గుర్తించినట్లు ఉన్నతాధికారలు తెలిపారు.
కానిస్టేబుల్ ముసుదుల్ రెహ్మాన్ సొంత రాష్ట్రం పశ్చిమబెంగాల్ అని చెప్పారు. నదియా సొంత గ్రామం అని వెల్లడించారు. ఇక ముసుదుల్ రెహ్మాన్ కాల్పులు జరిపి హత్య చేసిన ఐదుమంది భద్రతా సిబ్బందిలో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారని చెప్పారు. ఇక మృతి చెందిన వారిని ఐటీబీపీలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎం సింగ్, కానిస్టేబుల్ సుజీత్ సర్కార్, హెడ్ కానిస్టేబుల్ దుల్జీత్, కానిస్టేబుల్ బిస్వరూప్ మహతో, కానిస్టేబుల్ బ్రిజేష్లుగా గుర్తించారు.
ఇదిలా ఉంటే లెఫ్టిస్ట్ భావజాలాలు ఉన్న నారాయణపూర్ జిల్లా మావోయిస్టులకు అడ్డాగా ఉంది. ఇక్కడ నుంచి మావోయిస్టులు తమ కీలకమైన ఆపరేషన్స్ నిర్వహిస్తుంటారు. అంతేకాదు దట్టమైన అభుజ్మద్ అభయారణ్యంకు నారాయణపూర్ చాలా దగ్గరలో ఉంటుంది. మహారాష్ట్ర చత్తీస్గఢ్ల మధ్య అభుజ్మద్ ఒక కొండ ప్రాంతంగా ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతం మావోయిస్టులకు అడ్డగా ఉంది. మావోయిస్టుల అగ్రనేతలు ఇప్పటికీ ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం సర్వే చేయించలేదు. దట్టమైన అడవులు రాళ్లు ఉండటం వల్ల అది సాధ్యపడలేదు. 2017లో సర్వే చేయించాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఇక్కడ మావోయిస్టులు దాడులు నిర్వహించడంతో ఆ ఆలోచనను విరమించుకుంది.