ఘోర ప్రమాదం: లోయలో పడిన బస్సు, ఐదుగురు మృతి, 35 మందికి గాయాలు
ముంబై: మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి నందూర్బర్ వద్ద లోయలో పడిపోయింది. దీంతో బస్సులోని ఐదుగురు ప్రయాణికులు మరణించారు. మరో 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
నందుర్బర్ ఎస్పీ మహేంద్ర పండిత్ తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. నందుర్బర్లోని ఖమ్చౌండర్ గ్రామం వద్ద బస్సు లోయలో పడిందని తెలిపారు.
బుధవారం వేకువజామున ఒంటిగంట ప్రాంతంలో మహారాష్ట్రలోని మల్కాపూర్ నుంచి గుజరాత్లోని సూరత్ ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించినట్లు వెల్లడించారు. మెహకర్ నుంచి సూరత్ వెళుతున్న మరో బస్సు వెనుకనుంచి ఢీకొనడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. సుమారు 60-80 ఫీట్ల లోతులోని లోయలో బస్సు పడిందని, ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో డ్రైవర్, క్లీనర్ తోపాటు ముగ్గురు ప్రయాణికులు ఉన్నారని చెప్పారు.
Recommended Video
నందుర్బర్ ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్రంగా గాయపడిన 35 మంది ప్రయాణికులకు చికిత్స అందిస్తున్నారు. క్రేన్లు, గ్యాస్ కట్టర్లను ఉపయోగించి బస్సులోని ప్రయాణికులను బయటికి తీసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సహాయ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, ఎస్డీపీవో, ఐదుగురు అధికారులు, 50 మందితో కూడిన రెస్కూ బృందం పాల్గొననట్లు వెల్లడించారు.