జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం..అమరులైన కల్నల్తో సహా మరో నలుగురు
జమ్మూకశ్మీర్: ఓ వైపు దేశం మొత్తం కరోనాపై పోరాడుతుంటే సరిహద్దుల్లో మాత్రం ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అలా రెచ్చిపోయిన ఉగ్రవాదులకు భారత బలగాలు గట్టిగా బుద్ధి చెప్పాయి. జమ్ముకశ్మీర్లో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయారు.
కుప్వారా జిల్లాలోని హంద్వారాలో భారత బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక కల్నల్ ఒక మేజర్తో పాటు ఇద్దరు జవాన్లు ఒక పోలీస్ ఎస్ఐ అమరులయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దాదాపు 8 గంటల పాటు జరిగిన ఈ భీకరపోరు ముగిసింది.
ఉగ్రదాడికి అమరులైన వారిలో 21 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అశుతోష్ శర్మ ఉన్నారు. ఆయన పలు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్కు ప్రాతినిథ్యం వహించారు. హంద్వారాలో నక్కి ఉన్న ఉగ్రమూకలను ఏరివేసే క్రమంలో తెల్లారుజామునుంచే భారత బలగాలు ఆపరేషన్ను చేపట్టాయి.
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్లో భాగంగా నక్కి ఉన్న ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది సైన్యం. ఆపరేషన్లో భాగంగా హంద్వారాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
ప్రాథమిక సమాచారం మేరకు రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన బలగాలు హంద్వారాలోని ఇళ్లల్లోకి వెళ్లి ఉన్నట్లు తెలుస్తోంది. పౌరులకు ఉగ్రవాదుల నుంచి భద్రత కల్పించేందుకు వారు ఇళ్లల్లోకి వెళ్లి ఉన్నట్లు సమాచారం. పౌరులను బంధీలుగా తీసుకునే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడి ఇళ్లల్లోకి బలగాలు వెళ్లి ఉన్నాయి. ఇక ఎన్కౌంటర్కు ముందు ఇళ్లల్లో ఉండే వారిని సురక్షితంగా ఖాళీ చేయించారు. ఇక ఆపరేషన్ మొదలు పెట్టి ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.