భూకంపం వస్తే పాట్నాలో 5లక్షలమంది మరణిస్తారు: సీఎం నితీష్
పాట్నా: బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో భూకంపం వస్తే నిమిషాల్లో ఐదు లక్షల మంది మరణిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం హెచ్చరించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
నేపాల్లో వచ్చిన పెను భూకంపం బీహార్లో సంభవిస్తే పాట్నాలో ఐదు లక్షల మంది ప్రాణాలు గాలిలో కలుస్తాయన్నారు. భద్రత నియమాలను పక్కన పెట్టి చిన్నచిన్న సందులలో పెద్ద పెద్ద భవంతులు కట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా భూకంపాలు మనకు హెచ్చరిక కావాలన్నారు. భూకంపాలను తట్టుకునే భవనాలను నిర్మించడంపై దృష్టి సారించాలన్నారు. ఇంజినీర్లకు ఆ దిశగా శిక్షణ ఇఫ్పించాలన్నారు. నేపాల్లో వచ్చి భూకంపం దాటికి బీహార్లో ప్రకంపనలు మాత్రమే వచ్చాయన్నారు.
అదే భూకంపం సంభవిస్తే ఘోర నష్టం ఉంటుందన్నారు. గత నెల 25న వచ్చిన భూకంపం, మంగళవారం వచ్చిన భూకంపాలు మనకు హెచ్చరికలన్నారు. మంగళవారం నాడు నేపాల్లో వచ్చిన భూకంపం దాటకి.. బీహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో, బీహార్లో 15 మంది మృతి చెందారు.