ఏఓబీలో కలకలం: భారీ ఎన్కౌంటర్: ఎదురు కాల్పుల్లో అయిదుమంది మావోయిస్టుల మృతి
భువనేశ్వర్: కొన్ని నెలలుగా భారీ ఎత్తున దాడులకు పాల్పడుతూ వస్తోన్న మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ల్లోని అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో అయిదుమంది మావోయిస్టులు మరణించారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మరణించారు. సుమారు మూడు గంటల పాటు ఎదురు కాల్పులు కొనసాగినట్లు తెలుస్తోంది. మరణించిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఛత్తీస్గఢ్లో తరచూ మందుపాతరలను పేల్చివేస్తూ, భద్రత బలగాలు, పోలీసులను పొట్టన బెట్టుకుంటూ వచ్చారు మావోయిస్టులు. కొద్దిరోజుల కిందటే- మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కూడా శక్తిమంతమైన ఐఈడీని అమర్చిన మందుపాతర ద్వారా క్విక్ రెస్పాన్స్ టీమ్ పోలీసులను హతమార్చారు. ఈ ఘటనలో మావోయిస్టులు బలపడ్డారనే వార్తలు వచ్చాయి.
తాజాగా ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పడువా పోలీస్ స్టేషన్ప పరిధిలో మావోయిస్టులు, పోలీసు బలగాలు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ) మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోరాపుట్ జిల్లా నందాపూర్ బ్లాక్ పరిధిలో గల హాతీబరి పంచాయతీ సమీపంలోని కిటువాకమ్టీ అడవుల్లో 15 మందికి పైగా మావోయిస్టులు సమావేశమైనట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు, ఎస్ఓజీ బలగాలు ఒక్కసారిగా దాడులు చేశాయి. వారిని చుట్టుముట్టి, బుల్లెట్ల వర్షాన్ని కురిపించాయి.
ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో అయిదుమంది మావోయిస్టుల మరణించినట్లు తెలుస్తోంది. వారి సంఖ్య మరింత పెరగొచ్చని అనుమానిస్తున్నారు. ఎన్కౌంటర్ సమాచారాన్ని కోరాపుట్ జిల్లా ఎస్పీ కేవీ సింగ్ ధృవీకరించారు. సంఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మూడు ఎస్ఎల్ఆర్, ఓ ఇన్సాస్ రైఫిల్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.