లోక్సభలో అత్యంత ధనవంతులు ఎవరంటే ? ఐదుగురి ఎంపీల వివరాలు ?
న్యూఢిల్లీ : 17వ లోక్సభలో అత్యంత ధనవంతులు ఎవరు ? అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఐదుగురని తేలింది. వీరు దేశంలో అత్యంత ధనికులు. ఐదుగురిలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఉండగా .. ఒకరు వైసీపీ, మరోకరు టీడీపీకి చెందిన నేత ఉన్నారు. వీరిలో బీజేపీ నేతకు చోటులేకపోవడం విశేషమని చెప్పాలి.
ధనవంత ఎంపీలు వీరే ..
దేశంలో 543 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో వెల్లూరు ఎన్నికను ఎన్నికల సంఘం రద్దుచేసిన సంగతి తెలిసిందే. నగదు ఎరులై పారడంతో రద్దుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 542 స్థానాలకు అభ్యర్థులు బరిలో ఉండి విజయం సాధించారు. ఇందులో 265 మంది కోటిశ్వరలని ఇప్పటికే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిర్ రిఫార్మ్స్ అనే సంస్థ వెల్లడించింది. కాంగ్రెస్ నుంచి ఎక్కువగా 43 మంది కోటీశ్వరులు ఉండగా .. డీఎంకే నుంచి 22 మంది, టీఎంసీ నుంచి 20 మంది, వైసీపీ నుంచి 19 మంది ఎంపీలు ఉన్నారు. మధ్యప్రదేశ్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ కుమారుడు నాకుల్ నాథ్. మధ్యప్రదేశ్లోని చింద్వారా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి క్వరేటిపై 37 వేల ఓట్లతో విజయం సాధించారు. ఓట్లే కాదు నాకుల్ .. ఆస్తులు కూడా ఎక్కువే. దాదాపు 660 కోట్ల ఆస్తులతో దేశంలో అధిక ధనవంత ఎంపీగా అవతరించారు.
తమిళ తంబి
తమిళనాడులోని కన్యాకుమారి నియోజకవర్గం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ నేత హెచ్ వసంత్ ధనవంత ఎంపీ జాబితాలో రెండోస్థానంలో ఉన్నారు. తనకు రూ.417 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు వసంత్. తన ప్రత్యర్థిపై 2 లక్షల 59 వేల ఓట్లతో గెలుపొందారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా, టీఎన్సీసీ ట్రేడర్స్ సెల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. బెంగళూరు రూరల్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందిన డీకే సురేశ్ ధనవంత ఎంపీ జాబితాలో మూడోస్థానంలో ఉన్నారు. తన ఆస్తులు రూ. 338 కోట్లు అని ఆయన ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి అశ్వత్ నారాయణ గౌడపై 2 లక్షల 6 వేల ఓట్ల మెజార్టీతో విజయకేతనం సాధించారు.
ఏపీ నుంచి ఇద్దరు
మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకకు చెందిన నేతలే కాదు .. ఏపీకి చెందిన నేతలు కూడా కోటీశ్వరులు. ఏపీలోని టీడీపీ, వైసీపీ చెందిన ఇద్దరు నేతలు వరుసగా నాలుగు, ఐదోస్థానంలో నిలిచారు. ఏపీలోని నరసాపురం నుంచి వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజా ఆస్తులు రూ.325 కోట్లని ప్రకటించారు. అత్యంత ధనవంత ఎంపీల జాబితాలో నాలుగోస్థానం దక్కించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రఘురామ కృష్ణరాజా ప్రముఖ పారిశ్రామికవేత్త. 2018 వరకు బీజేపీలో ఉండి .. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఏపీలోని గుంటూరుకు చెందిన గల్లా జయదేవ్ ఐదో స్థానంలో నిలిచారు. తన ఆస్తులు రూ.305 కోట్లని గల్లా జయదేవ్ ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై 4 వేల ఓట్లతో గల్లా జయదేవ్ గెలిచిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన గల్లా జయదేవ్ .. అమర రాజా బ్యాటరీస్ కంపెనీ అతనిదేనన్న సంగతి తెలిసిందే.