ఉగ్రవాదుల ఘాతుకం: కశ్మీర్లో కార్మికులపై కాల్పులు, ఐదుగురి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కశ్మీరేతర కూలీలపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన కాసేపటికే కాల్పులు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మృతులంతా పశ్చిమబెంగాల్ వాసులుగా గుర్తించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. రెండురోజుల్లో ఉగ్రవాదులు ఆరోసారి విరుచుకుపడ్డారు. దక్షిణ కశ్మీర్ టార్గెట్గా రెచ్చిపోతున్నారు. మృతుల స్వస్థలం ముర్షిదాబాద్ అని కశ్మీర్ డీజీపీ పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందని ఆయన పేర్కొన్నారు. పొట్టకూటి కోసం కశ్మీర్ వెళ్తే ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. మృతులంతా మేషన్లుగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.
జమ్ముకశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తూ ఉగ్రవాదులు రెచ్చిపోతారని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఢిల్లీలో 48 గంటలపాటు హై అలర్ట్ కూడా విధించారు. కశ్మీర్లో కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. కానీ ఉగ్రమూకలు మాత్రం కూలీలపై దాడులు చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని భద్రతా దళాలు తేల్చిచెప్పాయి.