New Coronavirus strain: భారత్లో అప్పుడే ఎంట్రీ? బ్రిటన్ నుంచి వచ్చిన అయిదుమందిలో లక్షణాలు
న్యూఢిల్లీ: బ్రిటన్లో ప్రమాదకరంగా విస్తరిస్తోన్న కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్.. భారత్లో అడుగు పెట్టందా? యూకేలో వెలుగులోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే ఈ కొత్త మహమ్మారి మనదేశం వరకూ పాకిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. బ్రిటన్ నుంచి దేశ రాజధానిలో దిగిన అయిదుమంది ప్రయాణికులు, విమాన సిబ్బందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారిని వెంటనే క్వారంటైన్కు తరలించారు అధికారులు. వారి నమూనాలను సేకరించి, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)కు పంపించారు.
బ్రిటన్ నుంచి న్యూఢిల్లీకి..
బ్రిటన్లో కొత్తగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ స్ట్రెయిన్..మరింత ప్రమాదకారిగా తేలింది. కరోనా వైరస్ కంటే భయానక పరిస్థితులను సృష్టించే సామర్థ్యం దీనికి ఉన్నట్లు నిపుణులు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి- చిన్నపిల్లలకు ఈ కొత్త వైరస్ స్ట్రెయిన్ మరింత సులువుగా సోకుతుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్ దక్షిణ ప్రాంతంలో ఊహించిన దానికంటే వేగంగా విస్తరిస్తోందని, ముందు జాగ్రత్త చర్యలను తీసుకోకపోతే..దేశం మొత్తాన్నీ కమ్మేయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
266 మంది ప్రయాణికుల్లో
విమాన సర్వీసులను నిలిపివేయడానికి ముందే..అక్కడి నుంచి 266 మంది ప్రయాణికులు భారత్కు బయలుదేరారు. వారంతా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆ వెంటనే వారికి ఆర్టీపీసీఆర్ ద్వారా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు. ఆ 266 మందిలో అయిదుమంది ప్రయాణికులు, విమాన సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వారికి నిర్వహించిన పరీక్షలు పాజిటివ్గా వచ్చాయి. దీనితో వారిని క్వారంటైన్కు తరలించారు. శాంపిళ్లను ఎన్సీడీసీకి పంపించారు. ఎన్సీడీసీ నుంచి నివేదికలు ఇంకా అందాల్సి ఉంది.
ఎన్సీడీసీకి శాంపిళ్లు..
ఈ మధ్యకాలంలో విమాన ప్రయాణికులెవరూ కరోనా వైరస్ బారిన పడలేదు. తాజాగా- కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ బ్రిటన్లో విజృంభించడం ఆరంభం కావడం, ఆ దేశానికి విమాన సర్వీసులను నిలిపివేయడం, అదే సమయంలో అక్కడి నుంచి వచ్చిన అయిదుమందిలో మహమ్మారి లక్షణాలు కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారికి సోకిందే కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ అని నిర్ధారితమైతే.. మరోసారి దేశంలో లాక్డౌన్.. నైట్ కర్ఫ్యూ వంటి పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
క్వారంటైన్కు తరలింపు..
ఈ అయిదుమందిలో విమాన సిబ్బంది కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశమని చెబుతున్నారు. ప్రయాణికులకు ఆహార పదార్థాలను అందించే సమయంలో వారి ద్వారా మిగిలిన 261 మంది ప్రయాణికులు, తోటి సిబ్బందికీ వైరస్ సోకే అవకాశాలు లేకపోలేదనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. అదే జరిగితే- విమాన ప్రయాణికులందరినీ ఎక్కడికక్కడ క్వారంటైన్లకు తరలించాల్సి ఉంటుందని, అదే సమయంలో- వారిని కాంటాక్ట్ వ్యక్తులను కూడా క్వారంటైన్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇది మరోమారు దేశంలో కరోనా వైరస్ విస్తరణకు దారి తీయొచ్చని అంచనా వేస్తున్నారు.