మంటల్లో కారు: 5 మంది సజీవదహనం: అతి వేగం..పొగమంచు: కంటైనర్ను ఢీ కొట్టి: ఎక్స్ప్రెస్ వే
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగం అయిదుమంది ప్రాణాలను తీసుకుంది. అతివేగానికి పొగమంచు తోడు కావడం ప్రమాదానికి దారి తీసింది. ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తోన్న ఓ కారు అదుపు తప్పి కంటైనర్ను ఢీ కొట్టింది. ఆ వెంటనే కారులో నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారు మొత్తాన్ని కమ్మేశాయి. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తోన్న అయిదు మంది సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.
ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. లక్నోకు చెందిన రాజ్కుమార్ అనే పేరు మీద ఈ కారు రిజిస్టర్ అయి ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆగ్రా వైపు నుంచి లక్నో వెళ్తోన్న ఈ కారు.. ఎక్స్ప్రెస్ వేపై గల ఖందౌలీ సమీపానికి చేరుకున్న వెంటనే ప్రమాదానికి గురైంది. కంటైనర్ డ్రైవర్ హఠాత్తుగా వాహనాన్ని కుడి వైపునకు తిప్పడంతో.. దాని వెనుకే వేగంగా వస్తోన్న కారు.. అదుపు తప్పి దాని ఢీ కొట్టింది.
నేరుగా కంటైనర్ డీజిల్ ట్యాంక్ను ఢీ కొట్టడంతో అది పగిలిపోయింది. అందులో ఉన్న డీజిల్ కారుపై పడటంతో మంటలు చెలరేగాయి. కంటైనర్ను ఢీ కొట్టిన వెంటనే కారు సెంట్రల్ లాక్ సిస్టమ్ స్తంభించిపోయింది. దీనితో అందులో ఉన్న ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేకపోయారు. డోర్లన్నీ మూసుకుపోవడంతో బయట పడే మార్గం లేక మంటల్లో కాలి బూడిదయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఎత్మాద్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.
మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని పేర్కొన్నారు. లక్నోకు చెందిన రాజ్కుమార్ అనే వ్యక్తి పేరు మీద కారు రిజిస్టర్ అయి ఉందని తెలిపారు. మృతులందరూ ఉన్నవ్కు చెందిన వారిగా గుర్తించామని అన్నారు. ప్రమాద సమయంలో ఎక్స్ప్రెస్ వేపై దట్టమైన పొగమంచు అలముకుని ఉందని చెప్పారు. పొగమంచు వల్ల ముందున్న వాహనాలు కనిపించట్లేదనే విషయంపై తాము వాహనదారుల కోసం ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామని, ఎక్స్ప్రెస్ వేపై పెట్రోలింగ్ను సైతం ఏర్పాటు చేశామని, తరచూ అనౌన్స్మెంట్లను వినిపిస్తున్నామని అన్నారు. పొగమంచు అలముకున్న సమయంలో వాహనదారులు నెమ్మదిగా రాకపోకలను సాగించాలని విజ్ఙప్తి చేశారు.