కూతురు పెళ్లి, గాలి మళ్లీ చక్రం తిప్పేనా: ఏం చెప్పాలనుకున్నారు? 5 కారణాలు
బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు బ్రాహ్మిణి పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు. ఈ పెళ్లి కార్డే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెళ్లి కూతురు ఆభరణాల నుంచి పెళ్లి సెట్టింగ్ వరకు అంతా అద్భుతం.
ఈ పెళ్లి ద్వారా ఏమైనా చెప్పదలుచుకున్నారా?
గాలి తన కూతురు పెళ్లి ద్వారా ఏమైనా చెప్పదలుచుకున్నారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అయిదు విషయాల ద్వారా ఈ పెళ్లిని ఓ రాజకీయ పావుగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
మొదటిది... గాలి జనార్ధన్ రెడ్డి కర్నాటక మాజీ మంత్రిగా పని చేశారు. తన కూతురు పెళ్లి ద్వారా ఆయన మరోసారి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కూతురు బ్రాహ్మణి పెళ్లికి ప్రధానంగా రాజకీయ పార్టీ నాయకులనే ఎక్కువగా పిలిచారు. నలభై నెలల పాటు జైలులో ఉండి వచ్చిన తాను.. తిరిగి రాజకీయాల పైన దృష్టి పెడతానని చెప్పకనే చెప్పారని అంటున్నారు.
రెండోది.. గతాన్ని మరిచి, తిరిగి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు తాను సిద్ధమని పార్టీ అధిష్టానానికి ఆయన చెప్పినట్లుగా దీనిని బట్టి అర్థమవుతోందని అంటున్నారు.
మూడోది... ప్రధానంగా రాజకీయ నాయకులకు డబ్బు ఆవశ్యకత ఎక్కువ. పార్టీకి, రాజకీయ అవసరాలకు కావాల్సిన డబ్బు తన వద్ద ఉందని ఈ పెళ్లి ద్వారా గాలి చెప్పినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. తన చర, స్థిరాస్తులను సీజ్ చేసినప్పటికీ ఇంకా తన వద్ద ఆస్తులు ఉన్నాయని ఆయన చెప్పదలుచుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
నాలుగోది.. వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులను ఈ పెళ్లికి ఆహ్వానించడం ద్వారా తన పైన ఉన్న కరప్షన్ ఛార్జెస్ను దూరం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఉదాహరణకు మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్ప వంటి సీనియర్లు ఈ పెళ్లికి వచ్చారు. మరోవైపు, కర్నాటకలోని బళ్లారి ప్రాంతంలో వీరికి ఇప్పటికీ మంచి పట్టు ఉంది.
ఐదవది.. గాలి జనార్ధన్ రెడ్డి తన ఆర్థిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ పెళ్లిని ఉపయోగించుకున్నాడని అంటున్నారు. మైనింగ్ కేసులు, జైలుకు వెళ్లిన నేపథ్యంలో రాజకీయంగా తిరిగి పుంజుకునే ఉద్దేశ్యంలో భాగంగా కూతురు పెళ్లి ద్వారా ప్రపంచానికి తనను తాను చూపించారని అంటున్నారు.