కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో ఐదుగురు సైనికుల మృతి
శ్రీనగర్: ఉగ్రవాదుల దాడిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఐదుగురు సైనికులు మరణించారు. నూతన సంవత్సరం సందర్బంగా పుల్వామాలోని సిఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు దాడి చేశారు.
ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. మరో ఉగ్రవాది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మొహమ్మద్ ప్రకటించింది.
నాలుగు రోజుల క్రితం నూరు మొహమ్మద్ తంత్రే అలియాస్ చోటా నూర్ హతం కావడంతో జైషే మొహమ్మద్కు తీవ్రమైన దెబ్బ తగిలింది. నవంబర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో జైష్ చీఫ్ మసూద్ అజర్ సమీప బంధువు ఉన్నాడు
ఉగ్రవాదాలు ఆదివారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో దాడి చేశారు. గ్రేనేడ్స్ విసురుతూ కాల్పులు జరుపుతూ పుల్వామాలోని సెంట్రల్ రిజర్వ్ పోలీసు పోర్స్ 185వ బెటాలియన్ కేంద్రంలోకి దూసుకొచ్చారు.
వెంటనే సిఆర్పీఎఫ్ బలగాలు ఎదురు దాడికి దిగాయి. అయితే ఉగ్రవాదుల దాడిలో సిఆర్పీఎఫ్ అదికారి షరీఫ్ ఉద్ దిన్ గనాయ్ అక్కడికక్కడే మరణించాడు. ఎదురు కాల్పుల్లో తౌపేల్ అహ్మద్, రాజేంద్ర నైన్, పికె పాండా అనే జవాన్లు మృతి చేదారు. భవనంలో చిక్కుకుపోయిన అధికారి కుల్దీప్ రాయ్ గుండె పోటుతో మరణించాడు.
ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులను పుల్వామాకు చెందిన మంజూర్ అహ్మద్ బాబా, ట్రాల్కు చెందిన పర్దీన్ అహ్మద్ ఖాండేలుగా గుర్తించారు.