స్టార్ హోటళ్లలో వైద్యులు, సిబ్బంది క్వారంటైన్, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం, బిల్లు మాత్రం..
కరోనా పాజిటివ్ వచ్చిన రోగులకు వైద్యులు, సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వైద్యులకు వైరస్ సోకకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తెల్ల కోటు వేసుకున్న దేవుళ్లు వైద్యులు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రస్తావించగా.. వైద్యులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల పలుమార్లు మీడియాతో మాట్లాడిన సమయంలో పేర్కొన్నారు.
వైద్యుల క్వారంటైన్..
దేశంలో పాజిటివ్ కేసులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికీ 1100 మందికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా..30 మంది వరకు చనిపోయారు. వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తోన్న వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, సిబ్బందిని కూడా క్వారంటైన్ చేయాలని ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అసలే వారు వైద్యులు అయినందున.. సాదా సీదాగా కాకుండా స్టార్ హోటళ్లను బుక్ చేశారు. అక్కడ వైద్యులు ఉన్న సమయానికి గల ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు హోటళ్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి.
వీరికి ఇక్కడ..
ఢిల్లీలో గల లోక్ నాయక్ జయప్రకాశ్, జీబీ పంత్ ఆస్పత్రి వైద్యులను లగ్జరీ హోటల్ లలిత్లో ఉండడానికి ఏర్పాట్లుచేశారు. హోటల్లో ఢిల్లీ ప్రభుత్వం 100 గదులను బుక్ చేసిందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. యూపీ ప్రభుత్వం కూడా నాలుగు స్టార్ హోటళ్లను బుక్ చేసింది.
యూపీలో కూడా..
లక్నోలో గల హయత్ రీజెన్సీ, ఫెయిర్ ఫీల్డ్ హోటల్, పిక్కడిల్లీ హోటల్, లెమన్ ట్రీ హోటల్లో గదులను బుక్ చేసింది. డాక్టర్ రాం మనోహర్ లోహియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన వైద్యులు, సిబ్బందిని హయత్ రీజెన్సీ, ఫిక్కడిల్లీ హోటల్లో సదుపాయాలు ఏర్పాటు చేశారు. సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన వైద్యులు, సిబ్బందిని ఫెయిర్ ఫీల్డ్, లెమన్ ట్రీ హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందికి అన్ని వసతులను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో వసతి కల్పిస్తారు.