వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి: పొట్టకూటి కోసం బెంగళూరు వచ్చిన నిరుపేద కుటుంబం !
బెంగళూరు : తల్లిదండ్రుల దగ్గరకు వెలుతున్న బాలుడి మీద వీధి కుక్కలు దాడి చెయ్యడంతో మృతి చెందిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బాలుడి మృతికి కారణం అయిన వీధి కుక్కలను చూసిన స్థానికులు ఆందోళనకు గురౌతున్నారు.
బెంగళూరు నగరంలోని సోలదేవనహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలోని అజ్జేనహళ్ళిలో మల్లప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మల్లప్ప కుమారుడు దుర్గేష్ (5). మంగళవారం ఇంటిలో ఉన్న తల్లి దగ్గర కుమారుడు దుర్గేష్ ను వదిలి పెట్టిన మల్లప్ప భార్యతో కలసి ఇంటి సమీపంలోని ఆచార్య కాలేజ్ వెనక కూలి పని చెయ్యడానికి వెళ్లాడు.
మంగళవారం మద్యాహ్నం ఇంటి సమీపంలో కూలి పని చేస్తున్న తల్లిదండ్రుల దగ్గరకు దుర్గేష్ వెళ్లాడు. తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న ఇసుకలో దుర్గేష్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో వీదిలోని కుక్కలు ఒక్కసారిగా దుర్గేష్ మీద దాడి చేశాయి.
కుమారుడి మీద వీధి కుక్కలు దాడి చేస్తున్న విషయం గుర్తించిన మల్లప్ప స్థానికుల సహాయంలో వాటిని పక్కకు తరిమి కుమారుడు దుర్గేష్ ను రక్షించి సప్తగిరి ఆసుపత్రికి తరలించాడు. అయితే చికిత్స విఫలమై దుర్గేష్ మృతి చెందాడు. కులబరిగికి చెందిన మల్లప్ప పొట్టకూటి కోసం కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు వచ్చాడు. వీధి కుక్కల దాడిలో దుర్గేష్ మృతి చెందడంతో మల్లప్ప కుటుంబ సభ్యులు బోరునవిలపిస్తున్నారు.
కర్ణాటకలోని హెచ్.డి. కోటేలో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న యశవంత్ (2), రజైన్ ఖాన్ (5) అనే చిన్నారుల మీద వీధి కుక్కలు దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైనాయి. శివాజీ రోడ్డులో అక్రమంగా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్నారని, మాంసం రుచి మరిగిన వీధి కుక్కలు చివరికి చిన్నారుల మీద దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.