ఐదేళ్ల బుడతడు.. విమానంలో ఒంటరిగా ప్రయాణం... ఢిల్లీ నుంచి బెంగళూరుకు..
సోమవారం(మే 25) నుంచి దేశవ్యాప్తంగా దేశీయ విమాన సర్వీసులను పునరుద్దరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారు విమానాల్లో తమ స్వరాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఓ ఐదేళ్ల బుడతడు సైతం ఒంటరిగా బెంగళూరుకు చేరుకున్నాడు. కుటుంబ సభ్యుల తోడు లేకుండా ఇంత చిన్న వయసులో ఒక్కడే ఒంటరిగా విమాన ప్రయాణం చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Recommended Video
పాక్ విమాన ప్రమాదం: కూలక ముందు సీసీ కెమరాల్లో రికార్డు.. పైలట్ చివరి మాటలు కూడా..!
ఎవరా బాలుడు..
విహాన్ శర్మ అనే ఆ బుడతడు లాక్ డౌన్ కారణంగా ఢిల్లీలోనే చిక్కుకుపోయాడు. నేటి నుంచి విమాన సర్వీసులు పునరుద్దరించబడటంతో అతని తల్లిదండ్రులు ఢిల్లీ-బెంగళూరు విమానానికి టికెట్ బుక్ చేశారు. ఢిల్లీలో తెలిసినవారు విమానాశ్రయానికి తీసుకొచ్చి విహాన్ను విమానం ఎక్కించారు.ముఖానికి మాస్కులు,చేతులకు గ్లౌజులు తొడుక్కున్న విహాన్.. స్పెషల్ కేటగిరీలో ప్రయాణించాడు. అతని చేతిలో ఓ సెల్ఫోన్ కూడా ఉంది.
సేఫ్గా బెంగళూరు చేరిన బాలుడు..
బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి చేరేంతవరకు విహాన్ తల్లి అతనితో ఫోన్లో టచ్లో ఉన్నారు. విమానశ్రయంలో దిగగానే అతన్ని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లారు. విమానశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. తమ బాబు 3 నెలులగా ఢిల్లీలో చిక్కుకుపోయాడని తెలిపారు. నేటి విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో మొదటిరోజే తమ అబ్బాయిని వెనక్కి రప్పించాలనుకున్నామని.. అనుకున్నట్టుగానే సేఫ్గా వచ్చేశాడని చెప్పారు. కెంపెగౌడ విమానశ్రయం నుంచి సోమవారం సుమారు 114 విమానాలు రాకపోకలు సాగించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో 60 విమానాలు బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లనుండగా.. 54 విమానాలు బయటి నుంచి బెంగళూరుకు రానున్నాయి. సోమవారం ఉదయం 9గంటల వరకు ఐదు విమానాలు కెంపెగౌడకు చేరుకున్నట్టు సమాచారం.
విమాన సర్వీసుల పునరుద్దరణ..
విమాన సర్వీసులు పునరుద్దరించబడినప్పటికీ పలు సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానశ్రయానికి చేరుకున్నాక సర్వీస్ రద్దయిందని చెప్పడంతో పలువురు నిరాశతో వెనుదిరిగారు. ఒక్క ఢిల్లీలోనే సుమారు 82 విమానాలు రద్దయినట్టు తెలుస్తోంది. బెంగళూరు,హైదరాబాద్,ముంబై తదితర నగరాల్లోని విమానాశ్రయాల్లోనూ పలు సర్వీసులు రద్దయినట్టు సమాచారం. దీంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్,పశ్చిమ బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాలకు నేటి నుంచి కమర్షియల్ విమానాలు ప్రారంభమయ్యాయి.