'కిడ్నాప్'కు జవాబు లేదు.. పైగా చిచ్చు పెట్టే స్టేట్మెంట్స్.. చైనాపై భగ్గుమన్న అరుణాచల్ విద్యార్థులు
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అపహరించినట్లుగా చెబుతున్న ఐదుగురు వ్యక్తుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు సోమవారం వెల్లడించారు. కనిపించకుండా పోయిన ఆ ఐదుగురు భారత ఆర్మీకి పోర్టర్స్,గైడ్స్గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. వీరంతా సుబన్సిరి జిల్లాలోని నాచో గ్రామానికి చెందినవారు. భారత్-చైనా మధ్య సరిహద్దును తెలిపే మెక్ మోహన్ రేఖకు భారత్ నుంచి నాచో గ్రామమే చివరి అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్ కావడం గమనార్హం. ఓవైపు కిడ్నాప్ ఉదంతంపై భారత్ చైనాను ప్రశ్నిస్తుంటే... మరోవైపు డ్రాగన్ కంట్రీ మాత్రం 'అరుణాచల్ ప్రదేశ్'పై వివాదాస్పద వ్యాఖ్యలతో చిచ్చు రేపుతోంది.
ఏడుగురిలో తిరిగొచ్చింది ఇద్దరే...
కిడ్నాప్కి గురైన రోజు మొత్తం ఏడుగురు సభ్యుల బృందం నాచోకి సమీపంలో ఉన్న అడవిలోకి వేటకు వెళ్లారు. ఇందులో ఇద్దరు సభ్యులు మాత్రమే తిరిగొచ్చారు. నాచోకి ఉత్తరాన 12కి.మీ దూరంలో ఉన్న ఆర్మీ పాట్రోల్ జోన్,సెరా-7 ప్రాంతంలో చైనా పీపుల్స్ ఆర్మీ తమను అడ్డగించినట్లు చెప్పారు. ఐదుగురిని కిడ్నాప్ చేయగా తాము పారిపోయి వచ్చినట్లు గ్రామస్తులతో తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఉద్రిక్తతలకు తెరలేపిన తరుణంలోనే ఈ ఘటన కూడా చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికీ చైనా వైపు నుంచి స్పందన లేదు...
తేజ్పూర్కి చెందిన భారత రక్షణ శాఖ ప్రతినిధి,లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్దన్ పాండే మాట్లాడుతూ.... కిడ్నాప్ అయిన ఐదుగురి ఆచూకీ కోసం తమ బృందాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. సివిల్ అడ్మినిస్ట్రేషన్తోనూ ఎప్పుడూ టచ్లో ఉంటున్నట్లు చెప్పారు. కిడ్నాప్ ఉదంతంపై చైనా పీఎల్ఏకి హాట్ లైన్ మెసేజ్ కూడా పంపినట్లు శనివారం(సెప్టెంబర్ 5) కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించినప్పటికీ... అటువైపు నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.
అరుణాచల్పై వివాదాస్పద వ్యాఖ్యలు
మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన దుందుడుకు తనాన్ని ప్రదర్శించింది. ఐదుగురు యువకుల కిడ్నాప్పై భారత్ సంధించిన ప్రశ్నకు నేరుగా జవాబివ్వని చైనా... సౌత్ టిబెట్ రీజియన్లో 'అరుణాచల్ ప్రదేశ్'గా పిలవబడే ప్రాంతాన్ని తాము ఎప్పుడూ గుర్తించలేదని పేర్కొంది. అంతేకాదు,కిడ్నాప్కి సంబంధించిన విషయమేదీ తమకు తెలియదని చెప్పింది. బీజింగ్లో మీడియా బ్రీఫింగ్ సందర్భంగా జావో లిజియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
భగ్గుమన్న అరుణాచల్ విద్యార్థులు...
చైనా సౌత్ టిబెట్లో అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాగమని డ్రాగన్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర అఖిలపక్ష స్టూడెంట్స్ యూనియన్ ఖండించింది. ఇకనైనా చైనా తమ వివాదాస్పద వైఖరికి ఫుల్ స్టాప్ పెడితే మంచిదని హెచ్చరించారు. భారతీయులుగా,బలమైన జాతీయవాదులుగా తామెంతో గర్వపడుతున్నామని... ఎవరో విదేశీయులు తమను గుర్తించాల్సిన పనిలేదని చైనాకు కౌంటర్ ఇచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు మానుకుని కిడ్నాప్ చేసిన ఐదుగురిని విడిచిపెట్టేలా పీఎల్ఏకి చైనా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.