ఇండియా గేట్కు పోటెత్తిన జనం.. ఐదు మెట్రో స్టేషన్లు మూసివేత..
మామూలుగానే వీకెండ్స్ లో రద్దీగా ఉండే ప్రాంతమది... ఆదివారం రిపబ్లిక్ డే కూడా కావడం.. అక్కడి కట్టడాలన్నీ అద్భుతంగా అలంకరించి ఉండటంతో ఢిల్లీలోని ఇండియా గేట్ కు జనం పోటెత్తారు. ఆదివారం సాయంత్రం ఒకేసారి 50వేల మందికిపైగా ప్రజలు ఇండియా గేట్ వద్ద గుమ్మకూడి సందడి చేశారు. దేశభక్తి గీతాలు పాడుతూ చిన్నాపెద్దా ఆనందించారు.
నిమిషాల వ్యవధిలోనే ఇన్ని వేలమంది ఇండియా గేట్ కు రావడంతో మెట్రో రైల్ సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. రద్దీని నియంత్రించలేని స్థితిలో ఢిల్లీ గేట్ చుట్టుపక్కలున్న ఐదు స్టేషన్లను మూసేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) ప్రకటించింది. ఎంట్రీ, ఎగ్జిట్ రెండిటినీ బంద్ పెట్టినట్లు పేర్కొంది.
ఉద్యోగ్ భవన్, సెంట్రల్ సెక్రటేరియట్, ఖాన్ మార్కెట్, సుప్రీంకోర్టు, మండి హౌజ్ మెట్రో స్టేషన్లలో ప్రవేశాన్ని తాత్కాలికంగా నిషేధించినట్లు మెట్రో అధికారులు సోమవారం ప్రకటించారు. ఉదయం రిపబ్లిక్ డే పరేడ్ జరిగిన రాజ్ పథ్, ఇండియా గేట్, సీ-హెగ్జాగాన్ ఏరియాలు సాయంత్రానికి పిక్నిక్ స్పాట్లుగా మారాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం 71వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఎగరేయగా, ఈ వేడుకులకు బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బొల్సోనారో చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ముఖ్యఅధికారులూ వేడుకల్లో పాల్గొన్నారు. సైనిక పాటవ ప్రదర్శన, రాష్ట్రాల శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి.