విషాదం : 50 మంది చిన్నారులు మృతి... కారణం ఏంటంటే..
ముజఫర్పూర్ : బీహార్లో విషాదం చోటుచేసుకుంది. చిన్నారుల వరుస మరణాలు వారి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాయి. ముజఫర్పూర్లో మెదడు వాపు వ్యాధి లక్షణాలతో 48గంటల వ్యవధిలో 50 మంది పిల్లలు మృత్యువాతపడ్డారు. మరో 133 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం వల్లే చిన్నారులు చనిపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
దళితుడిని నగ్నంగా చేసి దాడి, ఊరేగింపు, వీడియో తీసి సోషల్ మీడియాలో, వైరల్!
మెదడువాపు లక్షణాలు
ముజఫర్పూర్ జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ హాస్పిటళ్లన్నీ మెదడువాపు లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులతో నిండిపోయాయి. తీవ్రమైన జ్వరం, మానసిక ఆందోళతో పాటు కోమాలోకి వెళ్లడం ఈ వ్యాధి లక్షణాలు. హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న పిల్లల్లో చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే కావడం గమనార్హం. ముజఫర్పూర్ పరిసర ప్రాంతాల్లో వేసవిలో మెదడువాపు లక్షణాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా 15ఏళ్ల లోపు పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతుంటారు. ఈ విషయం తెలిసినా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
పేదరికమే కారణం?
గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం కారణంగానే మెదడువాపు తరహా వ్యాధి వస్తోందని డాక్టర్లు అంటున్నారు. రాత్రి పూట పిల్లలు ఆహారం తినకుండా ఖాళీ కడుపుతో పడుకుంటే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోతాయని వారంటున్నారు. దీని వల్ల పిల్లల్లో మెదడువాపు లక్షణాలతో పాటు హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడం, ఒక్కోసారి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
వ్యాధి కారకాలపై అధ్యయనం
గత రెండేళ్లుగా మెదడువాపు కేసులు తగ్గినా ఈసారి మళ్లీ 50 మంది చిన్నారులు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజల్లో వ్యాధిపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 90 శాతం పిల్లలు రక్తంతో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల చనిపోతున్న నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయి అధ్యయనం చేసేందుకు సిద్ధమవుతున్నారు.