బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు: 50 లక్షల మంది ముస్లింలను దేశం నుంచి పంపుతాం..!
కోల్కతా: అసలే దేశంలో ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు నిరసనలు వ్యక్తమవుతుండగా అధికార పార్టీ నాయకుల నోళ్లకు అదుపులేకుండా పోతోంది. వారు చేసే వ్యాఖ్యలతో దేశంలో మరింత ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోశారు. దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన 50 లక్షల మంది ముస్లింలను దేశం నుంచి వెల్లగొడతామనే వివాదాస్పద వ్యాఖ్యలు దిలీప్ ఘోష్ చేశారు.
సీఏఏకు ఎన్ఆర్సీలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిసిస్తున్న క్రమంలో ఆమెపై మాటల దాడి చేస్తూ దిలీప్ ఘోష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా 50 లక్షల మంది అక్రమవలసదారులైన ముస్లింలను గుర్తిస్తామని చెప్పిన దిలీప్ ఘోష్... అవసరమైతే వారిని దేశం నుంచి పంపించేస్తామని చెప్పారు. ముందుగా ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తామని చెప్పిన దిలీప్ ఘోష్... ఇలా చేస్తే మమతా బెనర్జీ ఇంకెవరి తరపున పోరాటం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. మమతా ఆరాటమంతా ఓట్ల కోసమే అని ఆయన నిప్పులు చెరిగారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దిలీప్ ఘోష్కు కొత్తేమీ కాదు. అంతకుముందు కూడా ఆయన కాంట్రవర్శీ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేసేవారిని కుక్కలను కాల్చినట్లు కాల్చాలంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరివని వారు ధ్వంసం చేస్తున్నారంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారి తండ్రివా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు ట్యాక్స్ పేయర్స్కు చెందుతాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిని మమతా ఎలాంటి చర్యలు తీసుకోరని ఎందుకంటే వారంతా తమ ఓటర్లు అని చెప్పారు దిలీప్ ఘోష్. అస్సాం, ఉత్తర్ ప్రదేశ్లలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిని అక్కడి బీజేపీ ప్రభుత్వాలు కుక్కలను కాల్చినట్లు కాల్చిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
#WATCH Dilip Ghosh, West Bengal BJP Chief in North 24 Parganas: 50 lakh Muslim infiltrators will be identified, if needed they will be chased out of the country. Firstly their names will be removed from voters' list then Didi (CM Mamata Banerjee) can't appease anyone. pic.twitter.com/ezY0HTWmB7
— ANI (@ANI) January 19, 2020
జాతి వ్యతిరేకులపై కాల్పులకు దిగి కర్నాటక, అస్సాం, ఉత్తర్ ప్రదేశ్లలోని తమ ప్రభుత్వాలు మంచి పనిచేశాయంటూ దిలీప్ ఘోష్ కొనియాడారు. వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని దిలీప్ ఘోష్ చెప్పారు. అక్రమంగా దేశంలోకి చొరబడి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నవారిని కాల్చకుండా తీర్థప్రసాదాలు ఇమ్మంటారా అని ప్రశ్నించారు. ముందుగా వారిని కాల్చేస్తామని ఆ తర్వాత బాంబులు వేస్తామని ఎవరినీ వదిలే ప్రసక్తేలేదని చెప్పారు.