కరోనా వ్యాక్సినేషన్ : ఢిల్లీలో 50 మందికి స్వల్ప అస్వస్థత... ఒకరికి సీరియస్...
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ క్యాంపెయిన్గా భారత్లో వ్యాక్సిన్ పంపిణీకి శనివారం(జనవరి 16) శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ తొలిరోజు విజయవంతంగా ముగిసింది. అయితే కొన్నిచోట్ల వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే కొంతమందిలో స్వల్ప రియాక్షన్స్ కనిపించాయి.
ఢిల్లీలో వ్యాక్సిన్ తీసుకున్న దాదాపు 51 మంది హెల్త్ కేర్ సిబ్బంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చరాక్ ఆస్పత్రి,నార్తర్న్ రైల్వే సెంట్రల్ ఆస్పత్రి,సౌత్ ఢిల్లీ,తూర్పు ఢిల్లీల్లో టీకా తీసుకున్నవారు ఉన్నారు. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు హెల్త్ కేర్ సిబ్బందికి ఛాతిలో పట్టేసినట్లుగా అనిపించడంతో వారిద్దరినీ 30 నిమిషాల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. ఆ తర్వాత ఇద్దరు సాధారణ స్థితికి వచ్చినట్లు సమాచారం.
మరో హెల్త్ కేర్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురి కాగా... అతన్ని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే అతనికి తలనొప్పి,చర్మంపై దద్దుర్లు,శ్వాసకోశ సమస్య తలెత్తాయి. వైద్యులు అతనికి హైడ్రోకోర్టిసోన్ ఇచ్చినప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి మెరుగవలేదు. దీంతో హుటాహుటిన ఎయిమ్స్కు తరలించారు. అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ (AEFI) గైడ్ లైన్స్ ప్రకారం ఈ కేసును సీరియస్గా పరిగణిస్తున్నారు. రాజస్తాన్లోనూ ఇదే తరహా కేసులు 21 నమోదయ్యాయి. ఇందులో అల్వార్ జిల్లాలో ఐదు,బర్మర్ జిల్లాలో నాలుగు,జైపూర్లో మూడు కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా మొత్తంగా 1,91,181 మందికి శనివారం వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 16,755 వ్యాక్సినేటర్లు,3352 సెషన్ల ద్వారా ఈ ప్రక్రియను నిర్వహించినట్లు పేర్కొంది. తొలి రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసినందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్దన్ అధికార యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు.
కాగా, ఢిల్లీలోని ఎయిమ్స్కి చెందిన పారిశుద్ద్య కార్మికుడు మనీష్ కుమార్ దేశంలో కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ,పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రవీంద్రనాథ్ చటర్జీ.. దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి పొలిటీషియన్లుగా నిలిచారు. యూపీలోని గౌతమ బుద్దనగర్కి చెందిన ఎంపీ మహేశ్ శర్మ(61) వృత్తి రీత్యా వైద్యుడు. తొలి దశలో హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇవ్వడంతో మహేశ్ శర్మ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు.పేషెంట్స్ వెల్ఫేర్ కమిటీలో రవీంద్రనాథ్ సభ్యుడిగా ఉండటంతో టీఎంసీ ఎమ్మెల్యేకి కూడా అధికారులు వ్యాక్సిన్ ఇచ్చారు.