50 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు.. బాంబ్ పేల్చిన బీజేపీ నేత..
ముంబై : కర్నాటకలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ మిగతా రాష్ట్రాల్లోపై పట్టు కోల్పోకుండా సకల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపక్ష పార్టీ సభ్యులను ఆకట్టుకునేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది చివరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన 50మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారన్న ఆయన చెప్పిన మాటలు ఆ పార్టీ నేతల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
సీనియర్ నేతల సంప్రదింపులు
కాంగ్రెస్ ఎన్సీపీకి చెందిన 50మంది ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీలో చేరుతారమని మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీష్ మహజన్ ప్రకటించారు. ఎన్సీపీ సీనియర్ నేత, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు చిత్రా వాఘ్ నెల రోజుల క్రితమే ఈ విషయంపై చర్చించేందుకు తనతో భేటీ అయ్యారని చెప్పారు. ఎన్సీపీతో తనకు రాజకీయ భవిష్యత్తు లేదన్న కారణంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆమె బాటలోనే మరికొందరు ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు నడుస్తారని గిరీష్ మహజన్ జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ - ఎన్సీపీ నేతల్లో కలవరం
కొన్ని రోజుల క్రితమే ఎన్సీపీ ముంబై చీఫ్ సచిన్ అహిర్ పార్టీకి గుడ్ బై చెప్పి శివసేనలో చేరారు. ఈ క్రమంలో మహజన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్తుండటం ఎన్సీపీ ఛీప్ శరద్ పవార్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల్లో కలకలం రేపాయి.
షాకిచ్చేందుకు రెడీ అవుతున్న కార్పొరేటర్లు
అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహారాష్ట్రలో ఎన్సీపీలకు భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో ఆ పార్టీ కార్పొరేటర్లతో పాటు నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సందీప్ నాయక్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 288 సీట్లున్న మహారాష్ట్రలో 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 122 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నాయి.