50శాతం మంది వాళ్ల పిల్లలే... ప్రతీ ఏటా హవా... 'సివిల్స్' ఫలితాలపై ఆసక్తికర డేటా...
దేశంలో అత్యున్నత సర్వీసులైన సివిల్ సర్వీసెస్ ఫలితాలు వెలువడ్డప్పుడల్లా.. దానికి ఎంపికైన వ్యక్తుల సక్సెస్ స్టోరీస్ గురించి మాట్లాడుకోవడం చాలా సహజం. మరీ ముఖ్యంగా పేదరికం,రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవాళ్ల సక్సెస్ స్టోరీస్ తెలుసుకోవడానికి మరింత ఆసక్తి కనబరుస్తుంటాం. నేపథ్యం ఏదైనా సివిల్ సర్వీసెస్ సాధించడమన్నది గొప్ప విషయమే. అయితే ఈ కలను సాకారం చేసుకుంటున్నవాళ్లలో ప్రతీ ఏటా 50శాతం మంది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే ఉండటం గమనార్హం. తాజాగా దీనికి సంబంధించి ఓ ఆసక్తికర డేటా తెర పైకి వచ్చింది.
ఎలా వచ్చిందీ డేటా...
లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(LBSNAA) వెల్లడించిన డేటా ప్రకారం... 2014 నుంచి ఇటీవల వెల్లడైన ఫలితాల వరకూ... సివిల్ సర్వీసెస్కు ఎంపికైనవారిలో 50శాతం మంది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే ఉన్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్ఎస్ సర్వీసులకు ఎంపికైనవారికి లాల్బహదూర్ శాస్త్రి అకాడమీలో ఫౌండేషన్ కోర్సును అందిస్తారు. గత ఏడాది వరకూ ఐఏఎస్,ఐఎఫ్ఎస్ సర్వీసులకు మాత్రమే ఈ కోర్సు తప్పనిసరి అన్న నిబంధన ఉండేది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం అన్ని సివిల్ సర్వీసులకు ఈ కోర్సును తప్పనిసరి చేసింది.
డేటా ప్రకారం...
లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం... 2019లో ఫౌండేషన్ కోర్సులో చేరిన 326 మంది ఆఫీసర్ ట్రైనీల్లో(సివిల్ సర్వీసెస్కు ఎంపికైనవారు)... 166 మంది తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగస్తులే. అంటే,50.9శాతం మంది ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే. అయితే ఈ అకాడమీలో ఆఫీసర్ ట్రైనీలకు సంబంధించి వారి తండ్రి వృత్తిపరమైన వివరాలు మాత్రమే నమోదు చేస్తారు. తల్లి వివరాలను నమోదు చేయరు.
2014 నుంచి 2019 వరకు డేటా...
2017 డేటాను పరిశీలిస్తే..లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 369 మంది ఆఫీసర్ ట్రైనీలు ఫౌండేషన్ కోర్సులో చేరారు. ఇందులో 212 మంది ఆఫీసర్ ట్రైనీల తండ్రులు ప్రభుత్వ ఉద్యోగాలకు చెందినవారు. అంటే,57.04శాతం. 2016లో 377 మంది ఆఫీసర్ ట్రైనీలు ఫౌండేషన్ కోర్సులో చేరగా... ఇందులో 208 (55.1శాతం) మంది ఆఫీసర్ ట్రైనీల తండ్రులు ప్రభుత్వ ఉద్యోగాలకు చెందినవారు. 2015లో 350 మంది ఫౌండేషన్ కోర్సులో చేరగా... ఇందులో 200మంది ట్రైనీల తండ్రులు ప్రభుత్వ ఉద్యోగాలకు చెందినవారు. అంటే, 57.14శాతం. 2014లో 285 మంది ఫౌండేషన్ కోర్సులో చేరగా... ఇందులో 171 మంది తండ్రులు ప్రభుత్వ ఉద్యోగాలకు చెందినవారు. 2018కి సంబంధించిన డేటా అందుబాటులో లేనప్పటికీ... ఆ ఏడాది దాదాపుగా 2014 ట్రెండ్స్ నమోదయ్యాయి.
ఆశయం,టాలెంట్ వల్లే...
2017,2019లో ఫౌండేషన్ కోర్సులో చేరిన మొత్తం 695 మంది ఆఫీసర్ ట్రైనీల్లో కేవలం 42 మంది మాత్రమే రైతుల పిల్లలు. గతంలోనూ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు సివిల్ సర్వీసెస్లో ఎక్కువ సంఖ్యలో చేరేవారని కొంతమంది అధికారులు చెప్తున్నారు. ప్రైవేట్ సెక్టార్లో అంతగా అవకాశాలు లేనిరోజుల్లో ఎక్కువమంది సివిల్ సర్వీసెస్ వైపే మొగ్గు చూపేవారని అంటున్నారు. సివిల్ సర్వీసెస్కు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా ఎంపికవడం ప్రత్యేకంగా దేనికి సూచిక కాదన్నారు. అది ప్రతిభ,ఆశయంపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు.