నితిన్ గడ్కరీ కూతురు పెళ్లికి వీవీఐపీలు: 50 విమానాలు
కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ కూతురు పెళ్లికి యాభై విమానాలు రావొచ్చునని తెలుస్తోంది. ఈ రోజు (ఆదివారం) గడ్కరీ కూతురు పెళ్లి మహారాష్ట్రలో జరగనుంది.
నాగపూర్: కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ కూతురు పెళ్లికి యాభై విమానాలు రావొచ్చునని తెలుస్తోంది. ఈ రోజు (ఆదివారం) గడ్కరీ కూతురు పెళ్లి మహారాష్ట్రలో జరగనుంది. ఈ పెళ్లికి రాజకీయ, ఇతర రంగాలకు చెందిన అతిరథమహారథులంతా హాజరవుతున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, ప్రకాశ్జవదేకర్, పియూష్ గోయెల్ తదితరులు రావొచ్చు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్చౌహాన్లు కూడా పెళ్లికి హాజరుకానున్నారు.
యోగా గురువు రామ్దేవ్ బాబా, మహారాష్ట్ర నవనిర్మాణసేన సారథి రాజ్ థాకరే తదితరులు హాజరవనున్నారు. మహారాష్ట్ర గవర్నరు సిహెచ్ విద్యాసాగర్ రావు, అసోం గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్లు మాత్రం తాము వివాహానికి రాలేమని చెప్పారు. అయితే, ఈనెల 8న ఢిల్లీలో ఇచ్చే రిసెప్షన్కు ఇద్దరు హాజరయ్యే అవకాశముంది.
నాగపూర్లో జరిగే గడ్కరీ కూతురు పెళ్లికి దాదాపు పదివేల మంది అతిథులు రావొచ్చునని తెలుస్తోంది. ఇందులో వివిఐపీలు కూడా ఉన్నారు. ఈ పెళ్లికి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు. పలువురు వీవీఐపీలు దాదాపు యాభై విమానాల్లో రావొచ్చునని అంటున్నారు.
ఇదిలా ఉండగా, తన కూతురు పెళ్లికి 50 చార్డర్ విమానాలు వస్తాయన్న వార్తలను నితిన్ గడ్కరీ కొట్టి పారేశారు. ఆ వార్తలు అవాస్తవం, అందులో నిజం లేదు అని చెప్పారు.