50శాతం రేప్లు: జెఎన్యుపై ఎమ్మెల్యే, స్మృతికి బిజెపి ఎంపీ షాక్
జైపూర్/ఢిల్లీ: రాజస్థాన్ బిజెపి ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహూజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగే 50 శాతం అత్యాచారాలకు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యు) విద్యార్థులే కారణమని వ్యాఖ్యానించారు.
జెఎన్యుకి వ్యతిరేకంగా జరిగిన ఓ నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. జెఎన్యు క్యాంపస్లో రోజూ వేల సంఖ్యలో మందు బాటిళ్లు, సిగరెట్ పీకలు, కండోమ్లు తదితరాలు కనిపిస్తాయన్నారు. పార్టీల పేరుతో అక్కడ యువత నగ్నంగా నృత్యాలు చేస్తారన్నారు.
ఆ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో బిజెపి అధిష్ఠానం ఆయన్ని వివరణ కోరింది. అయినా ఆయన మళ్లీ శుక్రవారం కూడా ఇలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దాంతో సామాజిక మాధ్యమాల్లో మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మోడీ, స్మృతి ఇరానీలకు బిజెపి ఎంపీ ఝలక్
ఓ వైపు మహిషాసుర అమరత్వంపై దేశవ్యాప్తంగా చర్చ, ఆపై ప్రభుత్వ, విపక్షాల మధ్య ఆరోపణల తీవ్రత జరుగుతుండగా.. తాజాగా బిజెపి ఎంపీ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలనూ గౌరవించే వ్యక్తిగా, గతంలో జెఎన్యులో జరిగిన మహిషాసుర ఉత్సవాల్లో పాల్గొన్నానని ఎంపీ ఉదిత్ రాజ్ వెల్లడించారు.
2011 నుంచి వర్శిటీలో అక్టోబర్ నెలలో ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. జెఎన్యు పూర్వ విద్యార్థిగా తాను పాల్గొన్నానని, ఒకప్పుడు తాను కూడా మహిషాసురుడిని నమ్మానని, ఆపై మారానని చెప్పుకొచ్చారు. ఎల్లకాలం ఒకే అభిప్రాయాలతో ఉండి, మారలేని వారు మృతులతో సమానమన్నారు.
తాను ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నానని, వాటి నిర్వాహకుల దృష్టిలో తాను ఆ ఈవెంట్లను చూడబోనని అన్నారు. మహిషాసుర పూజలను ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేసిన ప్రసంగం ప్రకంపనలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే.