పీఎన్బీ స్కాం: నీరవ్ వద్ద నగలు కొన్నవారిపై ఐటీ ఫోకస్, పన్ను లెక్కలు తేలాల్సిందే!
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.వేల కోట్ల మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసుకు సంబంధించి అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు మరో కీలక చర్య తీసుకుంటున్నారు. నీరవ్ మోడీ వద్ద ఖరీదైన నగలు కొనుగోలు చేసిన సంపన్నులపై ఆదాయపన్ను శాఖ అధికారుల దృష్టి పడింది.
నీరవ్ మోడీకి చెందిన దుకాణాల నుంచి అత్యంత ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేసిన దాదాపు 50 మంది భారత సంపన్నులపై దర్యాప్తు చేస్తామని, వారి పన్ను రిటర్నులను తిరిగి పరిశీలించాలని నిర్ణయించామని అధికారులు వెల్లడించారు.
అంతటి ఖరీదైన ఆభరణాలు కొనుగోలుకు సంబంధించి ఆదాయ, రిటర్నుల వివరాలు తెలియజేయాలని అధికారులు వారికి నోటీసులు పంపనున్నారు. నీరవ్ దుకాణాల నుంచి పలు పత్రాలను సేకరించామని, వాటి ప్రకారం ఖరీదైన వజ్రాల నగలు కొనుగోలు చేసిన వారు డబ్బును కొంత డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా, మరికొంత చెక్కుల ద్వారా, మిగతాది నగదు రూపంలో చెల్లించారని అధికారులు తెలిపారు.
కాగా, ట్యాక్స్ నోటీసుల్లో చాలా మంది తాము ఎలాంటి నగదు చెల్లింపులు చేయలేదని చెప్పినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో నీరవ్ మోడీ కుంభకోణం 2011లో మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత దర్యాప్తు సంస్థలకు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయడంతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే నీరవ్ మోడీ, మరో నిందితుడు మెహుల్ ఛోక్సీలు దేశం దాటి పారిపోయారు.