బదౌని ఘటన మరవకముందే.. మరో 50 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్.. జననాంగాల్లో స్టీల్ గ్లాసు దూర్చి చిత్రహింసలు...
ఇటీవల ఉత్తరప్రదేశ్లోని బదౌని జిల్లాలో 50 ఏళ్ల మహిళపై పూజారి,అతని శిష్యులు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవకముందే... అదే తరహాలో జార్ఖండ్లో మరో దారణం చోటు చేసుకుంది. చత్రా జిల్లాలోని కోబ్నా గ్రామంలో 50 ఏళ్ల ఓ వితంతువుపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె జననాంగాల్లో స్టీల్ గ్లాసును దూర్చి చిత్రహింసలకు గురిచేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. హంటర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది.
వితంతువు ఒంటరిగా..
పోలీసుల కథనం ప్రకారం... కోబ్నా గ్రామానికి చెందిన ఓ వితంతువు ఒంటరిగా జీవిస్తోంది. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆమెపై కన్నేశారు. గురువారం(జనవరి 7) రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డ ఆ ముగ్గురు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమె జననాంగాల్లో స్టీల్ గ్లాసును దూర్చి చిత్రహింసలకు గురిచేశారు. దీంతో బాధితురాలికి తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం హంటర్గంజ్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు మెడికల్ ఆఫీసర్ డా.వెంకట్ ప్రకాశ్ తెలిపారు.
మహిళలకు రక్షణ లేకుండా ..
ఈ ఘటనకు సంబంధించి ముుగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా... అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలి కాలంలో జార్ఖండ్లో మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోయాయి. గతేడాది డిసెంబర్లో జార్ఖండ్లోని దుంకా జిల్లాలో భర్తతో కలిసి సంతకు వెళ్లి తిరిగొస్తున్న ఓ వివాహిత గ్యాంగ్ రేప్కు గురైంది. అంతకుముందు,ఖుంతీ జిల్లాలోని కర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల మైనర్ బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. జార్ఖండ్ క్రైమ్ గణాంకాల ప్రకారం గతేడాది జులై వరకు రాష్ట్రంలో 1033 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2019లో మొత్తం 1,416 అత్యాచార కేసులు నమోదవగా... 2020లో 7 నెలల కాలంలోనే వెయ్యికి పైగా అత్యాచార కేసులు నమోదవడం గమనార్హం. ప్రభుత్వ వైఫల్యం వల్లే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది.
50 ఏళ్ల వివాహిత అయిన..
ఉత్తరప్రదేశ్లోని బదౌని జిల్లా ఉఘాటిలో 50 ఏళ్ల వివాహిత అయిన ఓ అంగన్ వాడీ కార్యకర్తపై జరిగిన గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. సాయంత్రం సమయంలో ఇంటి నుంచి స్థానిక ఆలయానికి వెళ్లిన ఆమె గ్యాంగ్ రేప్కి గురైంది. బాధితురాలి జననాంగాల్లో ఇనుప రాడ్లు దూర్చి దుండగులు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు.కాలు,పక్కటెముకలను కూడా విరగ్గొట్టినట్లు పోస్టుమార్టమ్ నివేదికలో తేలింది. ఆలయ పూజారి,అతని శిశ్యులే అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆ ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు. అంతకుముందు,ఇదే యూపీలో జరిగిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే.