ఆ కూతకు 50 ఏళ్లు.. నిర్విరామంగా సేవలు.. శభాష్ రాజధాని
కోల్కతా : భారతీయ రైల్వేకు సరికొత్త నిర్వచనం చెప్పిన రాజధాని ఎక్స్ప్రెస్ హాఫ్ సెంచరీ కొట్టింది. 49 ఏళ్లు పూర్తి చేసుకుని 50వ ఏట అడుగుపెట్టింది. 1969లో తొలిసారిగా కూతపెట్టి నిర్విరామంగా ప్రయాణీకులకు సేవలందిస్తోంది. ఆ క్రమంలో ఆదివారం నాడు 50వ ఏట ప్రవేశించి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంది.
1969, మార్చి 3వ తేదీన కోల్కతా-న్యూఢిల్లీ మధ్య మొదటిసారిగా ప్రయాణించింది. అప్పట్లో ఫుల్ ఎయిర్ కండిషన్డ్ తో పాటు హైస్పీడ్ ట్రైన్ గా రాజసం ఒలకబోసింది. 1450 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 17 గంటల 20 నిమిషాల్లో చేరుకోవడం విశేషం. ఆదివారం నాడు 50వ ఏట అడుగుపెట్టిన రాజధానిని.. రైల్వే సిబ్బంది పూలతో అందంగా అలంకరించారు. ముగ్గురు మాజీ ఉద్యోగులు జెండా ఊపడంతో హౌరా నుంచి బయలుదేరింది.
రాజధాని ఎక్స్ప్రెస్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రైల్వే సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. దీని ప్రయాణం మొదలైన తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు హౌరా స్టేషన్ లో 9వ నెంబర్ ప్లాట్ఫామ్ పైనే దీనికి చోటు దక్కుతుండటం విశేషం. ఆదివారం నాడు కూడా అదే ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరింది.
అయితే రాజధాని గోల్డెన్ జూబ్లీ ప్రయాణంలో తాము భాగస్వాములవుతున్నామనే విషయం ట్రైన్ ఎక్కేవరకు కూడా ప్రయాణీకులకు తెలియదు. ఈ సందర్భంగా ప్యాసింజర్ల కొరకు స్పెషల్ వంటకాలు తయారు చేయించింది రైల్వేశాఖ. సంప్రదాయ వంటకాలతో పాటు వెజ్, నాన్ వెజ్, ఐస్క్రీమ్, రసగుల్లాలను ప్రత్యేకంగా అందించారు. టికెట్ తో పాటే భోజనానికి ఛార్జీ వసూలు చేసే విధానం కూడా ఈ సందర్భంగా అమల్లోకి తెచ్చారు అధికారులు.