ట్రంప్ ఆగ్రా పర్యటన విశేషాలు: యమునా నదిలో దుర్వాసన రాకుండా అధికారులు ఏంచేశారంటే..?
ఢిల్లీ: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కోసం సర్వం సిద్ధమవుతోంది. ముందుగా ఆయన ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి గుజరాత్లోని అహ్మదాబాదుకు వెళతారు. ఇక రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా తాజ్మహల్ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతోంది యూపీ సర్కార్.
మురికి వాడలకు అడ్డుగా గోడల నిర్మాణం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన సందర్భంగా భారత్కు రానున్నారు. అమెరికా ప్రథమ మహిళ ట్రంప్ అర్థాంగి మెలీనా ట్రంప్ కూడా రానున్నారు. ట్రంప్ అహ్మదాబాద్కు వెళ్లి అక్కడ మొతారా క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొంటారు. ట్రంప్ రాక సందర్భంగా ఇప్పటికే మురికివాడలు కనిపించకుండా అడ్డుగా గోడలు నిర్మించింది ప్రభుత్వం. అంతేకాదు ఆ గోడలపై అందమైన పెయింటింగ్లు వేసింది. భారత్ అమెరికా బంధాన్ని తెలుపుతూ ఈ చిత్రాలు గోడలపై దర్శనమిస్తున్నాయి. ఇక దగ్గరలోని మురికివాడలను కూడా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
దుర్వాసన రాకుండా యుమునా నదిలోకి...
భారత పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అతని భార్య మెలీనాతో కలిసి ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శిస్తారు. ట్రంప్ తాజ్మహల్కు రానున్న నేపథ్యంలో అక్కడి పరిసర ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దింది. ఈ క్రమంలోనే తాజ్మహల్ వద్ద ఉన్నయమునా తీరంను ప్రభుత్వం శుభ్రం చేయిస్తోంది. అంతేకాదు యమునా నది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఆ వాసనను పోగొట్టేందుకు 500 క్యూసెక్కుల మంచినీటిని నదిలోకి పంప్ చేసింది. యమునా నది ఇటు ఢిల్లీకి అటు ఉత్తర్ ప్రదేశ్కు జీవనదిలా వ్యవహరిస్తుంది. ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల గుండా ఈ నది ప్రవహిస్తుంది.అయితే నదీ తీరంలో ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో ఈ పవిత్రమైన నది కాలుష్య కోరల్లో చిక్కుకుంది.
కాలుష్యాన్ని నియంత్రించొచ్చు
ఇక 500 క్యూసెక్కుల మంచి నీరును యమునా నదిలోకి పంప్ చేయడం వల్ల దుర్వాసన తొలగిపోతుందని ఉత్తర్ ప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతోంది. 500 క్యూసెక్కుల మంచినీటిని యమునా నదిలోకి పంప్ చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించొచ్చని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజినీర్ అరవింద్ కుమార్ చెప్పారు. అంతేకాదు మథురాలో ప్రవహించే యమునా నది ఆక్సిజన్ లెవెల్స్ను కూడా పెరుగుతాయని చెప్పారు. తాగేందుకు యమునా నదిలోని నీరు ఉపయోగపడదని... అయితే దుర్వాసన రాకుండా ఉపయోగపడుతుందని అరవింద్ తెలిపారు.
13 కిలోమీటర్ల మేరా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు
ట్రంప్ దంపతులు ఆగ్రా విమానాశ్రయం నుంచి తాజ్మహల్కు వెళ్లే దారిని కూడా అధికారులు ముస్తాబు చేస్తున్నారు. సర్వాంగ సుందరంగా వీధులను తీర్చి దిద్దుతున్నారు. ఆగ్రా విమానాశ్రయం నుంచి తాజ్మహల్కు మొత్తం 13 కిలోమీటర్లు దూరం ఉండగా... ఈ 13 కిలోమీటర్ల మేరా 3వేల మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. కళాకారులంతా ఆగ్రా, మథురా, వృందావన్ ప్రాంతానికి చెందినవారని ప్రభుత్వం తెలిపింది.