ఎయిడ్స్ బాధితుడి ఉన్మాదం ? 500 చిన్నారులకు మాయదారి రోగం..
పాకిస్తాన్: ఎయిడ్స్ మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఈ నయం కాని వ్యాధికోసం మందులు కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం ఏవి విజయం సాధించలేదు. తాజాగా పాకిస్తాన్లో ఎయిడ్స్ వ్యాధి కలకలం రేపుతోంది. అక్కడ చాలా మందికి ఎయిడ్స్ వ్యాధి సోకినట్లు టెస్టుల్లో వెల్లడైంది.
లర్కానా జిల్లాలో కోరలు చాచిన ఎయిడ్స్ మహమ్మారి
దాయాది దేశం పాకిస్తాన్ను ఇప్పటివరకు ఉగ్రవాదం భయపెట్టింది. ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి ఆ దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. మంచి భవిష్యత్తు ఉన్న చిన్నారుల జీవితాలను చిదిమేస్తోంది ఎయిడ్స్ మహమ్మారి. ఎవరో చేసిన తప్పుకు చిన్నారుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతోంది. లర్కానా జిల్లాకు చెందిన అలీరజా అనే పదేళ్ల కుర్రాడికి జ్వరం వచ్చింది. అబ్బాయి తల్లి రెహ్మానా బీబీ అలిరజాను హాస్పిటల్కు తీసుకెళ్లింది. పారాసిటామాల్ సిరప్ను డాక్టరు ఇచ్చి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పాడు. అయితే ఆ చుట్టు ప్రక్కల గ్రామాల్లోని చిన్నారులకు చాలామందికి జ్వరం వచ్చి ఆ తర్వాత పరీక్షలు చేయించగా ఎయిడ్స్ సోకినట్లు తేలడంతో రెహ్మానా కూడా ఆందోళన చెందింది.
చిన్నారికి వైద్య పరీక్షలు చేయగా ఎయిడ్స్ సోకినట్లు తేలింది
చిన్నారులకు జ్వరం వచ్చి ఆ తర్వాత ఎయిడ్స్ వచ్చిందన్న వార్తను తెలుసుకున్న రెహ్మానా బీబీ.. తన కొడుకు అలీరజాను అన్ని సదుపాయాలు ఉన్న మరో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించింది. పరీక్షలకు సంబంధించిన టెస్టులు రాగానే రెహ్మానా ఒక్కసారిగా కుప్పకూలింది. ఎయిడ్స్ తన కొడుకుకు కూడా సోకిందన్న చేదు నిజాన్ని విని తల్లడిల్లిపోయింది. అయితే ఆ గ్రామంలోని ఓ వైద్యుడికి ఎయిడ్స్ ఉండగా ఆ గ్రామంలోని ప్రజలు తన దగ్గరకు చికిత్స కోసం వచ్చినప్పుడు కావాలనే వారికి సిరంజి ద్వారా వైరస్ సోకేలా చేశాడనే ఆరోపణలు రావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
చుట్టపక్క గ్రామాల్లో దాదాపు 500 మందికి ఎయిడ్స్ సోకింది
ఇక తన కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా హెచ్ఐవీ టెస్టులు చేయించుకోగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పదేళ్ల చిన్నారి అలీరజా మాత్రమే ఎయిడ్స్ బారిన పడ్డాడు. ఇదిలా ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 500 మందికి ఎయిడ్స్ సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఇక ఈ తల్లి ఆవేదన అంతా ఇంతా కాదు. బంగారు భవిష్యత్తు ఉన్న తన బిడ్డను ఎయిడ్స్ మహమ్మారి కాటువేయడాన్ని జీర్ణించుకోలేకుంది. తన బిడ్డ పూర్తిగా ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని భగవంతుడికి ప్రతిరోజు ప్రార్థనలు చేస్తోంది.
స్థానిక వైద్యుడే ఎయిడ్స్ వైరస్ను ఇంజెక్ట్ చేశాడా..?
సింద్ ప్రావిన్స్లోని ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం చీఫ్ సికందర్ మీమన్ మరిన్ని విషయాలను వెల్లడించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి 13,800 మందికి హెచ్ఐవీ టెస్టులు నిర్వహించగా అందులో 410 మంది చిన్నారులకు ఎయిడ్స్ సోకినట్లు తెలిపారు. మరో 100 మంది పెద్దల్లో ఈ మహమ్మారి చొచ్చుకుపోయినట్లు చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా 23వేల మందికి ఎయిడ్స్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. సిరంజిల పట్ల జాగ్రత్త వహించకపోవడంతోనే ఎయిడ్స్ ప్రబలుతోందని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే స్థానిక వైద్యుడు గంఘరోకు ఎయిడ్స్ సోకిందని ఏప్రిల్ నెలలో అతను చాలామందికి చికిత్స సమయంలో ఒకే సిరంజిని వాడినట్లు తెలుస్తోంది. అయితే ఇది కావాలనే చేశాడా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
లర్కానా మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో సొంత జిల్లా. 2007లో రావల్పిండిలో జరిగిన బాంబు దాడిలో ఆమె మృతి చెందారు. ఆమె తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టో కూడా పాక్ ప్రధానిగా1970వ శతకంలో పనిచేశారు. అయితే నాటి మిలటరీ నియంత జనరల్ జియాఉల్ హక్ జుల్ఫికర్ అలీ భుట్టోను ఉరితీశాడు.