మోడీ సర్కార్ యమ స్పీడ్: పాత వాహనాల చిట్టా రెడీ చేసిన గడ్కరీ: తుక్కు కిందికి 67 లక్షలకు పైగా
న్యూఢిల్లీ: వాహనాలను తుక్కు కిందికి మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 20 ఏళ్లకు పైబడి తిరుగుతోన్న వ్యక్తిగత వాహనాలు, 15 ఏళ్లకు పైనున్న కమర్షియల్ వెహికల్స్ జాబితాను సిద్ధం చేసింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన కాస్సేపటికే దీనికి సంబంధించిన వివరాలను రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.త్వరలోనే వాటిని తుక్కు కిందికి మార్బోతోన్నామని ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
నిర్మలమ్మ బడ్జెట్పై సాదినేని యామిని రియాక్షన్ ఇదీ: ఆ రంగానికి మేలు చేసేలా: ఏపీ బీజేపీ నేత
దేశవ్యాప్తంగా 20 సంవత్సరాలకు పైనున్న వ్యక్తిగత వాహనాలు, 15 ఏళ్లకు పైబడిన కమర్షియల్ వాహనాలను స్క్రాప్ చేస్తామంటూ నిర్మలా సీతారామన్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికోసం కొత్తగా స్క్రాపేజీ విధానాన్ని తీసుకుని వస్తామని ఆమె ప్రకటించారు. దీనిపై రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్పందించింది. స్క్రాప్గా మార్చడానికి ఉద్దేశించిన వాహనాలను వివరాలను ప్రకటించింది. 15 రోజుల్లోగా తాము కొత్త స్క్రాపేజీ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
దేశవ్యాప్తంగా 67 లక్షలకు పైగా పాత వాహనాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఇందులో 51 లక్షల వరకు 20 ఏళ్లకు పైబడిన తేలికపాటి వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే కేటగిరీలో 15 సంవత్సరాలకు పైగా నడిచిన వాహనాలు 34 లక్షలు ఉన్నాయని అన్నారు. మధ్య, భారీ కమర్షియల్ వాహనాల సంఖ్య 17 లక్షలకు పైగా ఉన్నాయని, అవన్నీ 15 సంవత్సరాలకు పైగా తిరుగుతున్నాయని చెప్పారు. అందులో చాలావాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు సైతం లేవని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. 20 ఏళ్లకు పైనున్న వాహనాలను స్క్రాప్ కిందికి మార్చడం వల్ల ఆటోమొబైల్ రంగానికి మరింత ఊతం ఇచ్చినట్టవుతుందని గడ్కరీ వ్యాఖ్యానించారు.