లాక్ డౌన్ వేళ దారుణం.. మహిళా బ్యాంకు మేనేజర్పై అత్యాచారం..
లాక్ డౌన్ వేళ మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. 53 ఏళ్ల ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. లాక్ డౌన్లో రాకపోకలపై నిషేధం ఉన్నవేళ.. రాష్ట్ర రాజధాని భోపాల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం ఒక్కసారిగా కలకలం రేపింది. దీంతో భోపాల్లో మహిళల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మహిళ ఒంటరిగా ఉంటోందన్న విషయం తెలుసుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఓ బ్యాంకులో ఓ మహిళ(53) మేనేజర్గా పనిచేస్తోంది. భోపాల్లోని షహ్పుర ప్రాంతంలో ఉన్న ఓ పోష్ కాలనీలో భర్తతో కలిసి ఆమె నివాసం ఉంటోంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆమె భర్త రాజస్తాన్లోని స్వగ్రామంలో చిక్కుకుపోయాడు. దీంతో భోపాల్లోని ఇంట్లో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఆమె ఒక్కరే ఉంటున్నారు. చాన్నాళ్లుగా కంటిచూపు సమస్యతోనూ ఆమె బాధపడుతున్నారు.
Recommended Video
ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. బలవంతంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నిందితుడు మెట్ల ద్వారా ఆమె నివసిస్తున్న సెకండ్ ఫ్లోర్కు చేరుకున్నాడు. ఆపై బాల్కనీ ద్వారా ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.