స్కూటర్పై తల్లితో నాలుగు దేశాలు చుట్టివచ్చాడు... 56,522కి.మీ ప్రయాణం...
ఆమెకు ఇల్లే ప్రపంచం... 71 ఏళ్ల తన జీవితంలో ఏనాడు పెద్దగా ఎక్కడికీ వెళ్లింది లేదు. అలాంటిది.. ఇప్పుడామె ఏకంగా నాలుగు దేశాలు చుట్టి వచ్చింది. కొడుకుతో కలిసి స్కూటర్పై నాలుగు దేశాల్లో ఎన్నో ఆలయాలను సందర్శించింది. వయసు పైబడ్డా స్కూటర్పై అంత దూరం ప్రయాణించడంలో తనకెలాంటి ఇబ్బంది,అసౌకర్యం అనిపించలేదని చెబుతోంది.
వివరాల్లోకి వెళ్తే... కర్ణాటకలోని మైసూరుకు చెందిన దక్షిణమూర్తి కృష్ణ కుమార్ జనవరి 16,2018న స్కూటర్పై తన తల్లి చౌదరత్నను ఎక్కించుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు. 'మాతృ సేవ సంకల్ప యాత్ర' పేరుతో స్కూటర్ పైనే తల్లిని నాలుగు దేశాలు(దాదాపు 56,522కి.మీ) తిప్పాడు. భారత్,నేపాల్,మయన్మార్,భూటాన్లలోని ఎన్నో దేవాలయాలు,పవిత్ర స్థలాలను చూపించాడు. రెండేళ్ల 9 నెలల కాలంలో ఈ నాలుగు దేశాలను చుట్టి వచ్చిన ఆ తల్లీకొడుకులు బుధవారం(సెప్టెంబర్ 16) తిరిగి కర్ణాటక చేరుకున్నారు.
'జీవితమంతా గృహిణిగానే గడిపిన నాకు ఈ యాత్ర చాలా గొప్ప అనుభూతిని కలిగించింది. నా జీవితంలో కనీసం కర్ణాటకలోని పర్యాటక ప్రాంతాలనైనా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ ఈరోజు నాలుగు దేశాల్లోని ఆలయాలను సందర్శించి రావడం సంతోషంగా ఉంది.' అని చౌదరత్న చెప్పుకొచ్చారు. ఈ మొత్తం ప్రయాణంలో తనకెలాంటి అసౌకర్యం,ఇబ్బందం కలగలేదన్నారు.
దక్షిణ మూర్తి మాట్లాడుతూ... తమ యాత్రను ముగించుకుని కర్ణాటక చేరుకున్నాక స్థానికులు తమ పట్ల ఎంతో ప్రేమ చూపించారని చెప్పారు. కొద్దిరోజులు మండ్యాలో ఉన్నామని... మెలుకొటే సహా పలు ప్రాంతాలను సందర్శించామని చెప్పారు. యాత్రకు వెళ్లేముందకు ఇంటి తాళాన్ని పక్కింటివారికి ఇచ్చి వెళ్లామని చెప్పారు. తన తల్లిని ఇలా నాలుగు దేశాలకు తీసుకెళ్లి అన్ని ఆలయాలను చూపించడం సంతోషంగా ఉందన్నారు.