57 మందికి కరోనా, ఐదుగురికి గర్భం, ఇద్దరు మైనర్లు, ఒకరికీ హెచ్ఐవీ పాజిటివ్: షెల్టర్ హోంలో దారుణం..
అదీ ప్రభుత్వ వసతి గృహం.. నీలువనీడలేని వారికి ఆశ్రయం కల్పించే దేవాలయం. కానీ అలాంటి చోట జీర్ణించుకోలేని విషయం బయటపడింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 57 మందికి కరోనా రక్కసి సోకింది. అయితే ఇందులో కొందరు గర్భం దాల్చడం ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. ఇది చాలదన్నట్టు ఒకరికి హెచ్ఐవీ పాజిటివ్ ఉందనే కఠోర నిజం వెలుగుచూసింది. దీంతో షెల్టర్ హోంలో ఏం జరిగింది..? ఏం జరుగుతోంది..? వైరస్ వ్యాప్తి ఎలా కలిగింది, బాలికలు గర్భం ఎలా దాల్చారనే ప్రశ్నలు సామాన్యుడి మదిలో మెదలుతున్నాయి.
13 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన వివాహిత, కవలలు అని తెలిసి ఆనందం.. అంతలోనే విషాదం...
57 మందికి కరోనా
కాన్పూర్లో ప్రభుత్వ వసతి గృహం ఉంది. ఇక్కడ బాలికలు, యువతులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే ఇటీవల ఎందుకైనా మంచిదని కరోనా వైరస్ పరీక్షలు చేశారు. ఇంకేముంది 57 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో నోరెళ్లబెట్టడం వైద్య సిబ్బంది వంతయిపోయింది. సరై వైరస్ ఎవరి ద్వారా సంక్రమించింది అనుకునేలోపు.. మరో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. 57 మందిలో ఐదుగురు గర్భం దాల్చారని రిపోర్టులో తేలింది. ఇందులో ఇద్దరు మైనర్ బాలికలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అలా గర్భం దాల్చిన ఓ మైనర్ బాలికకు హెచ్ఐవీ పాజిటివ్ కూడా ఉంది అని నిర్ధారణ అయ్యింది. దీనిని జిల్లా కలెక్టర్ బ్రహ్మదేవ్ ధృవీకరించారు.
గర్భం దాల్చిన బాలికలు
57 మంది ఆగ్రా, ఈతహ్, కనౌజ్, ఫిరోజాబాద్ నుంచి కన్పూర్ వసతి గృహనికి వచ్చారన్నారు. అయితే వారు రావడానికి ముందే గర్భం దాల్చారని పేర్కొన్నారు. కరోనా వైరస్ నెగిటివ్ వచ్చిన ఇద్దరు బాలికలు కూడా గర్భం దాల్చారని.. వారిని చిన్నారుల సంక్షేమ అధికారులు కాన్పూర్ తరలించారని పేర్కొన్నారు. వైరస్ సోకిన ఐదుుగురు, మరో ఇద్దరు కలిపి మొత్తంగా ఏడుగురు బాలికలు గర్భం దాల్చడం కలకలం రేపుతోంది.
వైరస్ ఇలా..
వసతి గృహంలో పనిచేసే మహిళకు వారం కింద కరోనా వైరస్ సోకింది. తర్వాత ఈ నెల 18వ తేదీన పరీక్షలు చేశారు. ఆమె ద్వారా 33 మందికి వైరస్ పాకింది. మరో రెండు రోజుల తర్వాత పరీక్ష చేయగా 28 మంది పాజిటివ్ నిర్ధారణ జరిగింది. ఇలా వసతి గృహంలో వైరస్ పనిచేసే మహిళ ద్వారా వచ్చింది. కానీ గర్భం ఎలా దాల్చారనే ప్రశ్నకు పోలీసుల దర్యాప్తులో సమాధానం లభించే అవకాశం ఉంది.
అంతకుముందేనట..?
బాలికలు గర్భం దాల్చారనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారు షెల్టర్ హోంకు రాకముందే ప్రెగ్నెంట్ అయ్యారని కన్పూర్ కమిషనర్ సుధీర్ మహాదేవ్ కూడా చెబుతున్నారు. కానీ దర్యాప్తు చేస్తున్నామని.. నిజ నిజాలు బయటపెడుతామని పేర్కొన్నారు. ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దర్యాప్తు పేరుతో నిజాలను దాచే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.