లక్ష 71 వేలు, ఒక్కొక్కరి నుంచి ముక్కుపిండి వసూల్, ట్రక్కులో 57 మందిని కుక్కి, 40 డిగ్రీల ఎండలో...
కరోనా రక్కసి వల్ల చేతికి పనిలేదు. పట్నం పొమ్మంటే.. పల్లె రమ్మంటుంది. ఆంక్షలతో కూడిన రవాణాతో వలసకూలీలు ఆందోళన చెందుతున్నారు. చేతిలో కాస్త డబ్బులు ఉన్నవారు ట్రక్కులను మాట్లాడుకొని వెళుతున్నారు. డబ్బులు లేని వారు కాలినడకన గమ్య స్థానం బయల్దేరి సాహసయాత్ర చేస్తున్నారు. అయితే దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి ఓ ట్రక్కు వలసకూలీలతో బయల్దేరింది. ట్రక్కు థానే చేరగానే డ్రైవర్ ఆపివేశాడు. దీంతో అందులో ఉన్న కూలీల బాధ వర్ణణాతీతం.
కరోనావైరస్: ప్రపంచంలో మిలియన్ జనాభాలో ఎంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలుసా?
57 మంది..
మంగళవారం ఉదయం వలసకూలీలతో ముంబై నుంచి ట్రక్కు ఉత్తరప్రదేశ్ బయల్దేరింది. అయితే అందులో అప్పటికే 57 మందిని కుక్కారు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.3 వేల చొప్పున ముక్కుపిండీ మరీ వసూల్ చేశారు. అంటే లక్షా 71 వేల నగదు అందింది. అయినా ట్రక్కు ఓనర్ ఆశ తీరలేదు. థానే వెళ్లాక మరికొందరిని ఎక్కించుకొని.. గమ్యస్థానం వద్ద కూలీలను దింపివేయాలని కోరారు. దీంతో ఓనర్ మాటను తూ.చ తప్పకుండా పాటించాడు డ్రైవర్.
ఎండలో 5 గంటలు...
ఉదయం 9 గంటలకు ట్రక్కు థానే చేరుకుంది. కానీ యూపీ వచ్చేందుకు ఎవరూ లేరు. అలా కానీ ట్రక్కును పోనీయలేదు. భానుడి భగభగలు పెరిగి.. ఎండ 40 డిగ్రీలకు చేరింది. అందులోనే పురుషులు, మహిళలు, చిన్నారులను ఐదుగంటలపాటు ఉంచాడు. ఓ వైపు వేడి, ఉక్కపోత... కూలీలు నరకయాతన అనుభవించారు. ట్రక్కు పోనియాలని కోరితే గొడవ.. ఓనర్ ఇలా చెప్పాడని ఒక్కటే నస... అంతేకాదు తమకు ఎప్పుడూ.. ఎలా వెళ్లాలో తెలుసునని కాకమ్మ కబుర్లు చెప్పాడు.
జాగా లేదు.. కానీ
వాస్తవానికి ఆ ట్రక్కులో జాగాలేదు. ఇదే విషయాన్ని పెద్ద మనిషి చెబితే నీకేందుకు అని డ్రైవర్ నుంచి సమాధానం వచ్చింది. అంతేకాదు ఇలానే మాట్లాడితే ట్రక్కును బోల్తా కొట్టిస్తానని కూడా డ్రైవర్ నోరుజారాడని కూలీలు చెబుతున్నారు. కానీ డ్రైవర్ మాత్రం తాను అలా అనలేదని వాదిస్తున్నాడు. ముంబై నుంచి యూపీ, బీహర్, మధ్యప్రదేశ్ కూడా వలసకూలీలు ట్రక్కులలో వెళుతున్నారు.
వలసకూలీ వ్యధ
అలిబాగ్ నుంచి ఆసిఫ్ ఫత్వానీ అనే భవన నిర్మాణ కార్మికుడు ముంబై వచ్చాడు. ఇక్కడకొచ్చాక అతనిని సమస్యలు చుట్టుముట్టాయి. లాభం లేదనుకొని కాలినడనకన స్వగ్రామం వెళ్లిపోతున్నాడు. అంతేకాదు జన్మలో తాను ముంబై రాబోనని చెప్పారు. తన వద్ద చిల్లీ గవ్వ లేదు అని.. ఉండేందుకు ఇల్లు కూడా లేదని నిట్టూర్చాడు. ఆసిఫ్ లాగానే చాలా మంది వలసకూలీలు పొట్ట కూటీ కోసం పట్నం వచ్చి ఇబ్బంది పడుతున్నారు.