5వ రోజు రైతుల ఆందోళన.. ఢిల్లీ దిగ్బంధనానికి పిలుపుతో టెన్షన్ .. మంత్రుల భేటీ
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు కొనసాగిస్తున్న ఆందోళన ఐదో రోజుకు చేరుకుంది. ఆర్నెల్లు అయినా సరే ఆ చట్టాలు రద్దు చేసే దాకా ఇక్కడేఉంటామని , ఛలో ఢిల్లీలో కదం తొక్కిన రైతన్నలు తేల్చి చెప్పారు . చలో ఢిల్లీ ఆందోళనలో భాగంగా ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా నిరసనకారులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన తెలియజేస్తున్నారు. ఒకపక్క కేంద్ర ప్రభుత్వం బురారి లోని నిరంకారీ మైదానంలో నిరసనలు చేపట్టాలని, డిసెంబర్ 3వ తేదీన చర్చలను నిర్వహిస్తామని చెబుతోంది. సరిహద్దు మార్గాలను రైతులు నిర్బంధించడం సరికాదని పేర్కొంటోంది.
కేంద్రానికి ఢిల్లీ సర్కార్ షాక్ .. ఢిల్లీలో తాత్కాలిక జైళ్ళకు నో .. రైతుల డిమాండ్స్ న్యాయబద్ధమే
ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన
అయితే నిరంకారీ మైదానంలో కాకుండా రామ్ లీలా మైదానం లో నిరసనకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో మోహరించిన రైతులు ఢిల్లీ - గురుగావ్ , ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఫరీదాబాద్ సరిహద్దు ప్రాంతాలలో ప్రధాన రహదారులను దిగ్బంధిస్తామని చెప్పటంతో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నుండి సింఘూ , తిక్రీ బోర్డర్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతు నాయకులు ఢిల్లీలో కి వెళ్లే మార్గాలన్నింటినీ దిగ్భంధనం చేస్తామని చెప్తున్నారు. తక్షణం చర్చలు జరపాలని కోరుతున్నారు.
షరతులు విధిస్తే చర్చలకే రామన్న రైతులు .. ఢిల్లీ దిగ్బంధనం చేస్తామని హెచ్చరిక
ఢిల్లీ సరిహద్దుల్లో ఉండకుండా శివారులోని బురారి మైదానానికి వెళ్లి ఆందోళన చేస్తేనే చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొనడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు అసలు షరతులు విధిస్తే చర్చలకే రాబోము అని తేల్చి చెప్పారు. సరిహద్దు నుండి ఆందోళన కొనసాగిస్తామని, అవసరం అనుకుంటే ఢిల్లీ మొత్తాన్ని దిగ్బంధిస్తామని తేల్చి చెబుతున్నారు. మరో పక్క రైతులు ఆందోళనకు మద్దతు తెలుపుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం వెంటనే నేతలతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నదాతల తో ఎలాంటి షరతులు విధించకుండా తక్షణమే భేటీ అవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఘాజీపూర్ - ఘజియాబాద్ సరిహద్దుల్లో రైతుల ఆందోళన .. కాంక్రీట్ బారికేడ్ల ఏర్పాటు
మరోవైపు ఘాజీపూర్ - ఘజియాబాద్ సరిహద్దుల్లో వేలాదిమంది రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతులు లోనికి చొచ్చుకొని రాకుండా కాంక్రీట్ బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్న రాత్రి రైతులు బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇక పట్టిన పట్టు విడవకుండా రైతులు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు కీలక సమావేశం నిర్వహించారు.
నడ్డా నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ .. రైతుల ఆందోళనపై చర్చ
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర మంత్రులు సమావేశమై రైతుల ఆందోళన నేపథ్యంలో తాజా పరిస్థితులపై చర్చించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తదితరులు డిసెంబర్ 3న రైతు సంఘాలతో చర్చించటానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రైతుల ప్రభుత్వ సూచనలను బేఖాతరు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో రైతులతో చర్చలకు ఏ విధంగా ముందుకు వెళ్లాలో చర్చించినట్టు తెలుస్తుంది.