6-10 మంది పాక్ సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్థాన్ తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత సైన్యం వారికి తగిన గుణపాఠం చెప్పిందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడుల్లో 6 నుంచి 10 మంది పాక్ సైనికులు మృతి ఉంటారని భారత సైనికాధికారి బిపిన్ రావత్ తెలిపారు.
ఉగ్రవాదులు కూడా దాదాపు అదే స్థాయిలో హతమై ఉంటారని చెప్పారు. ఈ మేరకు రావత్ ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. నీలం వ్యాలీలో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు చెందిన నాలుగు స్థావరాలు లక్ష్యంగా భారత్ దాడులు చేసిందని, అందులో మూడు స్థావరాలు పూర్తిగా ధ్వంసం కాగా, మరోకటి స్వల్పంగా ధ్వంసమైందని వెల్లడించారు.
మొదట జురా, ఆత్ముకమ్, కుండల్సాహి స్థావరాల్లో ఎక్కువ సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని విశ్వసనీయ సమాచారం అందింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల తంగ్ధర్ సెక్టార్ లో కాల్పుల ద్వారా దేశంలో చొరబడేందుకు ప్రయత్నంచగా అడ్డుకునేందుకే సైన్యం ఈ దాడులు చేసిందని తెలిపారు.
ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొచ్చుకు రావడానికి సిద్ధంగా క్యాంపుల్లో ఉన్నారనే సమాచారం వచ్చిందని చెప్పారు. గత నెల రోజుల కాలంలో చాలా చోట్ల ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను గుర్తించామని రావత్ తెలిపారు.
ఇప్పటికే ఈ విషయంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్కు ఫోన్ చేసి తాంగ్ధర్ సెక్టార్లో ప్రస్తుత పరిణామాల గురించి అడిగితెలుసుకున్నారని తెలిసింది. కాగా, తంగ్ధర్ వద్ద జరిగిన దాడుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారని, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.
భారత డిప్యూటీ హైకమిషనర్కు నోటీసులు
పాకిస్తాన్ మరోసారి తన తెంపరితనాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్ లోని భారత రాయబార కార్యాలయం డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ అహ్లువాలియాకు సమన్లను జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంపై విచ్చలవిడిగా ఏర్పాటైన ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లు, శిబిరాలను భారత జవాన్లు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. గౌరవ్ అహ్లువాలియాకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లను జారీ చేసింది. ఆర్మీ కాల్పులకు సహేతుక వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆక్రమిత్ కాశ్మీర్ (పీఓకే) భూభాగంపై ఉగ్రవాదులు లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేసుకున్నారని, శిక్షణా శిబిరాలను నెలకొల్పినట్లు ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి పక్కా సమాచారం భారత సైన్యానికి అందింది. పీఓకే భూభాగంలోని జురా, కుందల్ షాహీ, ఆఠ్ముగాం ప్రాంతాల్లో లాంచ్ ప్యాడ్స్ ఉన్నట్లు నిర్ధారించింది. ఈ మూడు ప్రాంతాలు కూడా వాస్తవాధీన రేఖకు సమీపంలోని నీలం వ్యాలీలో ఉంటాయి. దీనితో వాటిని ధ్వంసం చేయాలని జవాన్లు నిర్ణయించుకున్నారు. దీనికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు.