సీఎంకు 6.5 కోట్ల కన్నడిగుల మద్దతు లేదు, సన్నివేశంలో శిశువు, కాంగ్రెస్ మద్దతు, మాజీ ప్రధాని!
బెంగళూరు: కర్ణాటకలో 6.5 కోట్ల మంది కన్నడిగుల ఆశీర్వాదంతో కుమారస్వామి ముఖ్యమంత్రి కాలేదని, ఆయన ఒక సన్నివేశంలో శిశువు (పిల్లాడు) మాత్రమే అని భారత మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తరువాత ఇబ్బందులు ఎదురౌతాయని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి సీఎం అయ్యారని సోమవారం మీడియాకు మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ చెప్పారు.
రాజీనామా చేస్తా
కర్ణాటకలో రైతుల రుణమాఫీ చెయ్యలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతానని హెచ్.డి. కుమారస్వామి అన్నారు. తాను ఎప్పటికీ రైతు బిడ్డనే అని, రైతులు విషయంలో నిర్లక్షం చెయ్యనని, ఎవ్వరికీ అన్యాయం చెయ్యనని కుమారస్వామి మీడియాకు చెప్పారు.
సంకీర్ణంలో సాధ్యం కాదు
ఒక పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్బంలో అన్ని నిర్ణయాలు ఒక్కరే తీసుకోవడం సాధ్యం కాదని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఇరు పార్టీల నేతలు కలిసి నిర్ణయం తీసుకుంటే అందరికీ మంచిదని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.
ప్రజలు కాదు కాంగ్రెస్
6.5 కోట్ల మంది కన్నడిగుల మద్దతుతో తాను ముఖ్యమంత్రిని కాలేదని, కాంగ్రెస్ మద్దతుతో సీఎం అయ్యానని హెచ్.డి. కుమారస్వామి ఆదివారం బెంగళూరులో మీడియాకు చెప్పారు. ఈ విషయంపై స్పందించిన మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో కుమారస్వామి ఓ శిశువు మాత్రమే అని, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరని చెప్పారు.
బీజేపీ నీచ రాజకీయాలు
శుక్రవారం అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప జేడీఎస్ తండ్రి, కొడుకుల పార్టీ అంటూ చేసిన వ్యాఖ్యలపై మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మండిపడ్డారు. నీచ రాజకీయాలు చెయ్యడంలో యడ్యూరప్ప ముందు వరుసలో ఉంటారని హెచ్.డి. దేవేగౌడ విరుచుకుపడ్డారు.