యువతిని కిడ్నాప్ చేసి 'బ్రదర్స్'కు అమ్మకం... అత్యాచారం... వెలుగులోకి దారుణం...
మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లా బన్మోర్ ప్రాంతంలో ఆరుగురు అత్యాచార నిందితులను పోలీసులు శుక్రవారం(అగస్టు 14) అరెస్ట్ చేశారు. నిందితుల్లో నలుగురు యువతిని కిడ్నాప్ చేసి ఇద్దరు సోదరులకు అమ్మేశారు. ఆ ఇద్దరు సోదరులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగడంతో ఎట్టకేలకు నిందితులు పట్టుబడ్డారు.
మొరెనా ఎస్పీ అనురాగ్ సుజానియా కథనం ప్రకారం.... భోపాల్కు చెందిన ఓ యువతి కొద్ది నెలల క్రితం గ్వాలియర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో చేరింది. అక్కడ మాయా శాక్య అనే మహిళతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఈ క్రమంలో జూన్ నెలలో మాయా ఆమెను మొరెనా జిల్లాలోని జౌరా పట్టణానికి తీసుకెళ్లింది. అక్కడ తన సన్నిహితులైన మొహర్ సింగ్ రజక్,ఓంవతి,లోకేంద్ర శర్మలతో కలిసి మాయా ఆమెను కిడ్నాప్ చేసి బన్మోర్ ప్రాంతానికి తీసుకెళ్లింది.
అనంతరం ఆమెను అవివాహితులైన రణవీర్,విజయ్ గుర్జార్లకు రూ.2లక్షలకు అమ్మేసింది. ఆ ఇద్దరు సోదరులు ఆమెను తీవ్రంగా కొట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సహాయంతో బాధితురాలు భోపాల్లోని తన సోదరుడికి అసలు విషయం చేరవేసింది. అప్పటికే గత నెల రోజులుగా అతను తన సోదరి కోసం వెతుకుతున్నాడు. బన్మోర్ వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని అతను పోలీసులకు చేరవేశాడు. దీంతో ఎట్టకేలకు బాధితురాలిని పోలీసులు వారి చెర నుంచి విముక్తి చేశారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రేప్,కిడ్నాప్,దోపిడీల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా... న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.