హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడ్డ స్కూలుబస్సు ఆరుమంది చిన్నారులు మృతి
హిమాచల్ ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. సిరిమార్ జిల్లాలో విద్యార్థులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఏడుగురు చనిపోగా అందులో ఆరుమంది చిన్నారులు ఉన్నారు. శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఉదయం స్కూలుకు వెళ్లేందుకు బస్సు ఎక్కారు విద్యార్థులు. తల్లిదండ్రులకు బై చెప్పారు. అలా చెప్పిన వెళ్లిన విద్యార్థులు బస్సు ప్రమాదం రూపంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. బస్సు చుట్టు పక్కల గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకుని డీఏవీ పబ్లిక్ స్కూలుకు వెళుతుండగా ఈ ఘోర ఘటన జరిగింది. చనిపోయిన పిల్లలంతా 10 ఏళ్ల లోపువారే అని సిర్మార్ డిప్యూటీ కమిషనర్ లలిత్ జైన్ తెలిపారు. ప్రమాదంలో మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారని చెప్పారు. వారందరిని స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఇక ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా మరణించాడు. ప్రమాద సమయంలో మొత్తం 16 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిందన్న సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్, స్థానికులు ఘటనా స్థలానికి పరుగులు తీసి సహాయక చర్చలు చేపట్టారు. కొండ ప్రాంతంలో మలుపు ఉండగా అక్కడ బస్సు డ్రైవరు బస్సుపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.