బీజేపీ పరువు కాపాడిన ఆ ఇద్దరు ఎంపీలు: వారి నియోజకవర్గాల్లోనే ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేల గెలుపు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయగా.. అధికారం దక్కించుకుంటామంటూ భారీ ప్రకటనలు చేసిన బీజేపీ మాత్రం ఎనిమిది సీట్లకు పరిమితమైంది. అయితే, 2015లో సాధించిన మూడు స్థానాల కంటే మెరుగైన ఫలితాలే సాధించారని చెప్పుకోవచ్చు. బీజేపీ గెలిచిన 8 సీట్లలో 6 సీట్లు ఇద్దరు ఆ పార్టీ ఎంపీల నియోజకవర్గానికి చెందినవే కావడం గమనార్హం.
సీఎం పదవి రేసులో వీరిద్దరే కానీ..
ఒక వేళ ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ముందు వరుసలో ఉన్న బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు, ఎంపీ మనోజ్ తివారీ, మరో ఎంపీ గౌతమ్ గంభీర్ నియోజకవర్గాల్లోనే బీజేపీకి ఈ ఆరు సీట్లు రావడం విశేషం. నార్త్ ఈస్ట్, ఈస్ట్ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గాల్లోని ఆరు అసెంబ్లీ సీట్లు బీజేపీకి దక్కాయి.
ఆ రెండు ఎంపీ నియోజకవర్గాల్లోనే 6 సీట్లలో బీజేపీ గెలుపు
గౌతమ్ గంభీర్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈస్ట్ ఢిల్లీ లోక్సభ పరిధిలో గాంధీనగర్, లక్ష్మీనగర్, విశ్వాస్ నగర్ ఉన్నాయి. మనోజ్ తివారీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈస్ట్ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం పరిధిలో రోహ్తష్ నగర్, ఘోండా, కర్వాల్నగర్ ఉన్నాయి. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మిగితా రెండు స్థానాల్లో ఒకటి దక్షిణ ఢిల్లీలోని బదర్పూర్ కాగా, నార్థ్ వెస్ట్ ఢిల్లీలోని రోహిణి నియోజకవర్గం రెండోది. ఈస్ట్ ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి అనీల్ కుమార్ బాజ్పాయి .. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి నవీన్ చౌదరిపై 6079 ఓట్లతో గెలుపొందారు. విశ్వాస్నగర్ స్థానాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ శర్మ తిరిగి దక్కించుకున్నారు. ఆప్ అభ్యర్థి దీపక్ సింగ్లాపై ఈయన గెలుపొందారు. లక్ష్మీనగర్ నియోజకవర్గంలో పోటాపోటీగా ఉన్నట్లు అనిపించినా చివరకు బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ.. ఆప్ అభ్యర్థి నితిన్ త్యాగిపై గెలుపొందారు.
తివారీ నియోజకవర్గంలోనూ బీజేపీనే...
మనోజ్ తివారీ ప్రాతినిథ్యం వహించిన నార్త్ ఈస్ట్ ఢిల్లీలో కూడా బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందింది. రోహ్తష్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి మహాజన్ జితేందర్ మహాజన్.. ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యే సరితా సింగ్ను 13,241 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఘోండాలో బీజేపీ అభ్యర్థి అజయ్ మహావర్ 28,370 ఓట్ల తేడాతో భారీ విజయం అందుకున్నారు. ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదత్ శర్మ రెండో స్థానానికి పరిమితమయ్యారు. కర్వాల్ నగర్లో బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ గెలుపొందారు.
ఆప్ భారీ విజయం.. బోల్తాపడ్డ బీజేపీ
ఈస్ట్ ఢిల్లీ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 5 అసెంబ్లీ స్థానాలుండగా, నార్త్ ఈస్ట్ ఢిల్లీలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందగా.. ముస్తఫాబాద్ నియోజకవర్గంలో ఓటమి చవిచూసింది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జగదీష్ ప్రధాన్ ఓటమిపాలయ్యారు. ఇక్కడ ఆప్ అభ్యర్థి హజీ యూనస్ 20వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. మంగళవారం మధ్యాహ్నం వరకు 27వేల ఓట్ల ఆధిక్యాన్ని చూపిన ప్రధాన్.. చివరకు ఓటమిపాలయ్యారు. మంగళవారం విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 స్థానాల్లో గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. అధికార తమదేనంటూ నేతలు చెప్పుకున్నా.. రెండు అంకెల స్థానాలు కూడా దక్కించుకోలేకపోయింది. మొత్తం 70 స్థానాలు కలిగిని ఢిల్లీ అసెంబ్లీలో 2015లో జరిగిన ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలు దక్కించుకోగా.. బీజేపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది.