6 ఈడీ అధికారులకు కరోనా వైరస్, ఆఫీస్ సీల్, క్వారంటైన్లో 10 మంది సిబ్బంది...
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబ్బందిని కూడా కరోనా వైరస్ వదల్లేదు. ఆరుగురికి వైరస్ సోకడంతో కార్యాలయాన్నే రెండురోజులు సీల్ చేశారు. ఆ ఆరుగురితో కాంటాక్ట్ అయిన 10 మంది సిబ్బందిని క్వారంటైన్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఈడీ ఆఫీసు ప్రధాన కార్యాలయం కూడా సీల్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల జూనియర్ ర్యాంక్ గల అధికారి ఒకరు డిప్యుటేషన్లో ప్రధాన కార్యాయానికి వచ్చారు. సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ నుంచి వచ్చిన అతనికి కరోనా వైరస్ సోకింది. అతనితోపాటు మరో ఐదుగురికి సోకడంతో... ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి ఈడీ కార్యాలయ భవనాన్ని వారానికి రెండురోజులు శానిటైజ్ చేస్తారు. కార్యాలయంలో పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు.
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9 వేల 887 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇవే అత్యధిక కేసులు. అలాగే 294 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 6 వేల 642కి చేరింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2.3 లక్షలు దాటింది. నగరాలు, పట్టణాల నుంచి వలసకూలీలను స్వస్థలాలకు మే 1వ తేదీ నుంచి పంపిస్తోన్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వైరస్ సోకి లక్ష 14 వేల మంది కోలుకున్నారు. వైరస్ ఆవిర్భవించిన చైనాను.. భారత్ దాటేసింది. అక్కడికంటే ఇక్కడే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.