మహిళల వేషంలో వచ్చి మస్కా.. గ్యాంగ్స్టర్పై కాల్పులతో దద్దరిల్లిన కోర్టు
రోహ్తక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో ఆరుగురు గాయపడ్డారు.
చండీఘడ్: హర్యానాలోని ఓ కోర్టు ప్రాంగణంలో గ్యాంగ్ స్టర్ రమేశ్ లోహర్ పై కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో వారంతా మహిళల వేషధారణలో ఉండటం గమనార్హం. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకొస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రోహ్తక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఒక కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం గ్యాంగ్ స్టర్ రమేశ్ లోహర్ సహా మరికొంతమంది నిందితులను కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నిందితులు కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించగానే.. అప్పటికే మహిళల వేషధారణలో ఉన్న ఐదుగురు దుండగులు రమేశ్ పై కాల్పులు జరిపారు.
కాల్పుల అనంతరం దుండగులు ద్విచక్ర వాహనంపై అక్కడినుంచి పరారయ్యారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.