యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు మృతి,11 మందికి తీవ్ర గాయాలు...
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు, మరో వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున వారణాసి-జౌన్పూర్ బోర్డర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. వారణాసిలో బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో యూపీలో తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల మొరాదాబాద్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 25 మంది గాయపడ్డారు. ఆగ్రా-మొరాదాబాద్ హైవేపై ఓ బస్సు,ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.2లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు ఆర్థిక సాయం ప్రకటించారు.
గతేడాది నవంబర్లో ఇదే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్-లక్నో జాతీయ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ప్రయాగ్రాజ్ వైపు వేగంగా వెళుతున్న ఓ బొలెరో వాహనం.. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుకవైపు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు అక్కడికి పరిగెత్తుకొచ్చారు.