నదిలో బోల్తా పడిన ఓం సాయి ట్రావెల్స్ బస్సు: ఆరుమంది గల్లంతు
భోపాల్: మధ్యప్రదేశ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓం సాయి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుమంది మరణించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నిండుగా ప్రవహిస్తోన్న రిచ్చన్ నదిలో బస్సు బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆరుగురు గల్లంతయ్యారు. వారు మరణించి ఉంటారని అధికారులు నిర్ధారించారు. మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
వేములవాడలో స్కూల్ వ్యాన్ బోల్తా.. ముగ్గురు విద్యార్థులు బలి.. మద్యం మత్తులో డ్రైవర్..!
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి భోపాల్ మీదుగా ఛతార్ పూర్ కు బయలుదేరిన ఓం సాయి ట్రావెల్స్ కు చెందిన బస్సు రైసేన్ జిల్లాలో ప్రమాదానికి గురైంది. వంతెన దాటుతున్న సమయంలో అదుపు తప్పింది. రెయిలింగ్ ను ఢీ కొని నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుమంది గల్లంతయ్యారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో సుమారు 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
వంతెన మీద బస్సు అతి వేగంగా ప్రయాణించిందని, ఎదురుగా వస్తోన్న వాహనాన్ని తప్పించబోయిన డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని పంకజ్ సోని అనే ప్రయాణికుడు తెలిపారు. రెయిలింగ్ ను ఢీ కొట్టి నదిలో బోల్తా పడిందని చెప్పారు. తాను బస్సు కిటికీ అద్దాలను పగులగొట్టుకుని బయటికి వచ్చినట్లు చెప్పారు.
బస్సు నదిలో పడ్డ విషయాన్ని గుర్తించిన స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను రక్షించారు.
గాయపడ్డ వారిని రైసేన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని, వారు మరణించి ఉండొచ్చని జిల్లా ఎస్పీ మోనికా శుక్లా తెలిపారు.