విమానంలో ఆగిపోయిన చిట్టి గుండె.. ఆపరేషన్కు ముందే...
న్యూఢిల్లీ : లోకం తెలియని పసిపాప. ఆర్నెల్ల ప్రాయంలోనే వింత జబ్బు. గుండె జబ్బు రక్కసికి వైద్యం చేయించేందుకు ఆ తల్లిదండ్రులు బయల్దేరారు. తమ స్వస్థలం నుంచి దేశ రాజధానికి గంపెడశాలతో వెళ్లారు. కానీ విధి చిన్నచూపు చూసింది. వేగంగా చేరుకునేందుకు విమానంలో బయల్దేరిన ఫలితం లేకపోయింది. ఆ పసిపాప వీడ్కోలు అంటూ తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. తమ కూతురు విమానంలోనే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
బీహర్ రాష్ట్రంలోని బెగుసరైకి చెందిన ఫ్యామిలీ పుణెలో నివసిస్తోంది. అయితే ఆ దంపతులకు ఆర్నెల్ల క్రితం పాప జన్మించింది. తమకు పాప పుట్టిందనే సంతోషం వారిలో కొంతసేపు కూడా లేదు. ఆమె పసి హృదయంలో హోల్ ఉందనే కఠోర నిజాన్ని వైద్యులు తెలిపారు. పుణెలో వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో వారు పాపను తీసుకొని బయల్దేరారు. బస్సులో, రైలులో వెళితే ఇబ్బందవుతుందని విమానంలో బయల్దేరారు. అయినా ఫలితం లేకపోయింది. విధి వెక్కిరించింది. ఆ పసిపాపను తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకెళ్లాడు ఆ భగవంతుడు.
పుణె నుంచి స్పైస్ జెట్ విమానంలో ఢిల్లీ బయల్దేరారు ఆ దంపతులు. కానీ గాలిలో ఉండగానే పసిపాప ఊపిరి అనంతవాయువుల్లో కలిసిపోయింది. స్పైస్ జెట్ ఆన్ బోర్డులో ఉండగానే చిన్నారి చనిపోయింది. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎయిమ్స్లో చికిత్స కోసం వస్తే చనిపోయిందని వాపోయారు. ఈ ఘటనపై స్పందించేందుకు చిన్నారి తల్లిదండ్రులు నిరాకరించారు. అయితే తమ విమానంలో చనిపోయిన చిన్నారి మృతిపై స్పందించేందుకు స్పైస్ జెట్ విమానయాన సంస్థ నిరాకరించింది.