వయసు ఆరు ఏళ్లు, ఒకటవ తరగతి, ఎన్నికల ప్రచారం, బ్రాండ్ అంబాసడర్, దెబ్బకు !
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు 2018 మే 12వ తేదీ జరుగుతున్న సమయంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ప్రముఖులు ప్రచారం ముమ్మరం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ, సీఎం సిద్దరామయ్య, మాజీ సీఎంలు బీఎస్. యడ్యూరప్ప, హెచ్ డీ కుమారస్వామి తదితరులు ప్రచారం చేస్తున్నారు. శాసన సభ ఎన్నికల సందర్బంగా ఆరు ఏళ్ల కుర్రాడు ఇప్పుడు బ్రాండ్ అంబాసడర్ గా తెరమీదకు వచ్చాడు.
శివమొగ్గ పట్టణం
కర్ణాటకలోని శివమొగ్గ పట్టణంలోని వినోభనగరలో నివాసం ఉంటున్న శివకుమార్, ఆశా దంపతుల కుమారుడు ఇంద్రజిత్ (6) అదే పట్టణంలోని రాయల్ డైమెండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఒకటవ తరగతి చదువుతున్నాడు.
1 నుంచి 224 వరకు
కర్ణాటకలో మొత్తం 224 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. శాసన నియోజక వర్గం నెంబర్ ఒకటి నిప్పాణి నుంచి 224వ చివరి నియోజక వర్గం గుండ్లుపేట వరకు ఇంద్రజిత్ ఒక్క పోరపాటుకూడా లేకుండా వరుసగా సీరియల్ నెంబర్ తో సహ గడగడా శాసన సభ నియోజక వర్గాల పేర్లు చెప్పగలడు.
కలెక్టర్ కు కనెక్టు అయ్యాడు
ఇంద్రజిత్ ట్యాలెంట్ తెలుసుకున్న శివమొగ్గ జిల్లా కలెక్టర్ ఎం. లోకేష్ ఓ నిర్ణయానికి వచ్చారు. శివమొగ్గ జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి, వారిలో అవగాహన కల్పించడానికి ఇంద్రజిత్ ద్వారా ప్రచారం చేయించాలని నిర్ణయించారు.
ఓటు వేయాలని ఉంది
శివమొగ్గ జిల్లాలో ఓటు హక్కుపై అవగాహ కల్పిస్తున్న ఇంద్రజిత్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఓటు వెయ్యాలని ఆశగా ఉందని, అయితే వయసు లేదని అన్నాడు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఇంద్రజిత్ మనవి చేస్తున్న సమయంలో కలెక్టర్ ఎం. లోకేష్ వీడియో తీసి శివమొగ్గ జిల్లా ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది.
ఒక్కసారి చెబితే చాలు
ఇంద్రజిత్ తండ్రి శివకుమార్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తల్లి ఆశా ఇంటిలోనే ఉంటున్నారు. తన కుమారుడికి ఏ విషయం అయినా ఒక్కసారి చెబితే చాలు దాన్ని అలాగే పసిగట్టి గుర్తు పెట్టుకునే అలవాటు చిన్నప్పటి నుంచి ఉందని ఇంద్రజిత్ తండ్రి శివకుమార్ మీడియాకు చెప్పారు.