సార్! మా నాన్న జీతం పెంచండి: ముఖ్యమంత్రికి ఆరేళ్ల చిన్నారి లేఖ, ఇంకా ఏం రాసిందంటే?
ముంబై: తమ తండ్రి జీతం పెంచాలంటూ ఓ ఆరేళ్ల చిన్నారి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే లేఖ రాయడం విశేషం. తక్కువ జీతం కారణంగా తన తండ్రి ఎక్కువ సమయం విధుల్లో ఉంటూ తనతో గడపడం లేదంటూ ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేసింది.
మా తండ్రి జీతం తక్కువ కావడంతో...
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని జల్నా ప్రాంతానికి చెందిన శ్రియా హరాలే అనే ఆరేళ్ల చిన్నారి స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఆ అమ్మాయి తండ్రి అంబాద్ డిపోలో బస్ కండక్టర్గా పనిచేస్తున్నారు. అయితే, తక్కువ జీతం కారణంగా.. తన తండ్రి డబ్బుల కోసం ఎక్కువ సమయం విధుల్లో ఉంటున్నాడని.. దీంతో తాను తండ్రితో గడపలేకపోతున్నానంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు శ్రియా లేఖ రాసింది.
మా నాన్న జీతం పెంచితే..
‘సార్.. మా నాన్న నా వద్ద ఎక్కువ సమయం గడపడం లేదు. ఆయన లేకపోవడంతో నేను సరిగా చదవలేకపోతున్నా. మీరు జీతం పెంచితే ఆయన నాతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఉంటుంది' అని ఆ ఆరేళ్ల చిన్నారి మరాఠీలో ముఖ్యమంత్రికి లేఖ రాసింది.
నిద్రలేవక ముందే.. నిద్రపోయాక..
తాను నిద్రలేవక ముందే తన తండ్రి విధులకు వెళ్తారని.. తాను మళ్లీ నిద్రపోయాకే ఇంటికి చేరుకుంటారని ఆ చిన్నారి తన లేఖలో పేర్కొంది. దీంతో తనతో తండ్రి గడపలేకపోతున్నారని వాపోయింది. జల్నాలోని మ్యాటీసోదరి విద్యాలయలో చదువుతోంది ఆ విద్యార్థిని.
చిన్నారి తండ్రి ఏమన్నారంటే..?
ఈ విషయాన్ని ఆ చిన్నారి తండ్రి సచిన్ హారాలే మీడియాతో పంచుకున్నారు. ‘మా అమ్మాయి నా జీతం గురించి సీఎంకు లేఖ రాసి.. పోస్టు చేయమని నాకు ఇచ్చింది. నేను ఆర్డినరీ పోస్టు ద్వారా పంపాను. అది సీఎంకు చేరిందో లేదో నాకు తెలియదు' అని చిన్నారి తండ్రి తెలిపారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా రాలేదని చెప్పారు.